మమత బుజ్జగింపు రాజకీయాలతో ప్రజాస్వామ్యం నాశనం : West Bengal గవర్నర్
ABN , First Publish Date - 2022-07-14T00:12:40+05:30 IST
మమత బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్
కోల్కతా : మమత బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ (West Bengal) ప్రభుత్వంపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ (Jagdeep Dhankhar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న బుజ్జగింపు రాజకీయాల వల్ల ప్రజాస్వామ్యం ఆత్మ ధ్వంసమవుతోందన్నారు. ప్రతిపక్షాల రాజకీయ కార్యకలాపాలకు రాష్ట్రంలో స్థానం లభించడం లేదని ఆరోపించారు. దీనివల్ల సమాజంలో తీవ్రమైన అసమతుల్యత ఏర్పడుతుందని హెచ్చరించారు.
ధన్కర్ బగ్డోగ్రా విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్థిక రంగం, ప్రభుత్వోద్యోగాల్లో అభివృద్ధి, సాధికారత మతపరంగా జరుగుతున్నట్లు తెలిపారు. మతం ఆధారంగా సానుకూలత ప్రదర్శించడం ప్రజాస్వామిక విలువలకు పూర్తి వ్యతిరేకమని చెప్పారు. పశ్చిమ బెంగాల్కు పరిపాలనపరంగా తీవ్ర సమస్యలు ఉన్నాయన్నారు. వీటిపై గళమెత్తాలని మేధావులను, సాధారణ ప్రజానీకాన్ని కోరుతున్నానని చెప్పారు. మితిమీరిన బుజ్జగింపు, సంతుష్టీకరణ కనిపిస్తున్నాయన్నారు. ఈ బుజ్జగింపులు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తాయన్నారు.
మమత ప్రభుత్వం బ్యూరోక్రాట్లను అధికార పార్టీ TMC కీలుబొమ్మలుగా మార్చిందన్నారు. ఎంతో శ్రమిస్తే కానీ ఈ వ్యవస్థ మారదని చెప్పారు. మేధావులు, ప్రజలు మౌనంగా ఉండటం తనను తీవ్రంగా కలచివేస్తోందన్నారు. గత మూడేళ్ళలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్లు చెప్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో అలాంటిదేమీ కనిపించలేదన్నారు. తాను ఈ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ వ్యవస్థపై గళమెత్తకపోతే భావి తరాలు మనల్ని క్షమించబోవన్నారు.
ధన్కర్ ఉత్తర బెంగాల్లోని బగ్డోగ్రా విమానాశ్రయం నుంచి డార్జిలింగ్ (Darjeeling) వెళ్ళారు.