Link క్లిక్ చేస్తే రెండు గంటల్లో రెండు వేలు.. 30 వేలకు డబుల్.. చివరికి 3.50 లక్షల పెట్టుబడితో...!
ABN , First Publish Date - 2021-08-10T16:15:27+05:30 IST
బంధువులకు విషయం చెప్పి తన అకౌంట్ ద్వారా వారిచేత రూ. 3.50 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టించాడు. ఒక రోజు...
హైదరాబాద్ సిటీ/హిమాయత్నగర్ : యాప్లో పెట్టుబడులకు భారీ లాభాలు వస్తాయంటూ ట్రాప్ చేసిన కేటుగాళ్లు మూడున్నర లక్షలకు పైగా కాజేశారు. సిటీ సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్కు చెందిన భాస్కర్ ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో నైస్ షేర్స్ మొబైల్ యాప్లో పెట్టుబడి పెడితే వారం, పదిరోజుల్లో రెట్టింపు లాభాలు వస్తాయని, షేర్ మార్కెట్లో మాదిరిగా రోజువారీగా లాభాలు ఉంటాయని అందులో ఉంది. ఆ మెసేజ్ కింద లింక్ కూడా ఉంది. భాస్కర్ లింక్ను క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేశాడు. వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టాడు. రెండు గంటల వ్యవధిలో అతడి ఖాతాలో రెండువేల రూపాయలు జమ అయ్యాయి.
దీంతో రూ. 30 వేలు పెట్టుబడి పెట్టాడు. ఆ డబ్బు రెండు రోజుల్లో రెట్టింపు అయింది. దీంతో భాస్కర్ తన స్నేహితులు, బంధువులకు విషయం చెప్పి తన అకౌంట్ ద్వారా వారిచేత రూ. 3.50 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టించాడు. ఒక రోజు వరకు యాప్ వినియోగంలో ఉంది. మరుసటి రోజు ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా తెరుచుకోలేదు. తనకు లింక్ పంపించిన నంబర్కు కాల్ చేస్తే బ్లాక్ చేసినట్లు వచ్చింది. గూగుల్ ప్లే స్టోర్లో యాప్ను చూసేందుకు ప్రయత్నించగా అందులో యాప్ పేరే లేదు. మోసపోయానని గ్రహించిన భాస్కర్ ఇతర బాధితులతో కలిసి సిటీ సైబర్క్రైమ్స్లో సోమవారం ఫిర్యాదు చేశాడు.