యాహూ, ఏఓఎల్‌.. మళ్లీ చేతులు మారే!

ABN , First Publish Date - 2021-05-04T06:32:35+05:30 IST

గూగుల్‌, ఫేస్‌బుక్‌ ప్రవేశంతో ఆదరణ కోల్పోయిన ఆన్‌లైన్‌ వెబ్‌ సర్వీస్‌ దిగ్గజాలు యాహూ, ఏఓఎల్‌ మరోసారి చేతులు మారనున్నాయి...

యాహూ, ఏఓఎల్‌..  మళ్లీ చేతులు మారే!

  • వెరిజాన్‌ మీడియా వ్యాపారాల విక్రయం  
  • రూ.37,000 కోట్లకు అపోలో కొనుగోలు 

న్యూయార్క్‌: గూగుల్‌, ఫేస్‌బుక్‌ ప్రవేశంతో ఆదరణ కోల్పోయిన ఆన్‌లైన్‌ వెబ్‌ సర్వీస్‌ దిగ్గజాలు యాహూ, ఏఓఎల్‌ మరోసారి చేతులు మారనున్నాయి. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు అమెరికన్‌ టెలికమ్యూనికేషన్స్‌ దిగ్గజం వెరిజాన్‌ చేతుల్లో ఉన్నాయి. యాహూ, ఏఓఎల్‌ సహా తన మీడియా గ్రూప్‌ వ్యాపారాలను అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ అనే ప్రైవేట్‌ ఈక్విటీ కంపెనీకి విక్రయిస్తున్నట్లు వెరిజాన్‌ సోమవారం ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ 500 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో దాదాపు రూ.37,000 కోట్లు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో డీల్‌ పూర్తికావచ్చని అంచనా. యాహూ, ఏఓఎల్‌ను కొనుగోలు చేసిన విలువతో పోలిస్తే, వెరిజాన్‌కు దక్కనుంది చాలా తక్కువే. 2015లో ఏఓఎల్‌ను 440 కోట్ల డాలర్లకు చేజిక్కించుకున్న వెరిజాన్‌.. ఆ తర్వాత రెండేళ్లకు యాహూను 450 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. విక్రయించనున్న మీడియా వ్యాపారాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి చేర్చి కేవలం ‘యాహూ’గా పేరు మార్చనున్నారు. తాజా ఒప్పందంలో భాగంగా వెరిజాన్‌కు 425 కోట్ల డాలర్ల నగదుతో పాటు యాహూలో 10 శాతం ఈక్విటీ వాటా కూడా లభించనుంది.


Updated Date - 2021-05-04T06:32:35+05:30 IST