జీవీఎంసీ కమిషనర్తో ఏపీ టిడ్కో చైర్మన్ భేటీ
ABN , First Publish Date - 2022-09-27T06:13:30+05:30 IST
ఏపీ టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ సోమవారం జీవీఎంసీ కమిషనర్ పి.రాజాబాబు, ఇతర అధికారులతో భేటీ అయ్యారు.
లబ్ధిదారులకు ఇళ్ల అప్పగింతపై చర్చ
విశాఖపట్నం, సెప్టెంబరు 26: ఏపీ టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ సోమవారం జీవీఎంసీ కమిషనర్ పి.రాజాబాబు, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో జరుగుతున్న టిడ్కో హౌసింగ్ ప్రాజెక్టు పనుల పురోగతిని ఈ సందర్భంగా కమిషనర్కు ప్రత్యేక ఫోటో ఆల్బమ్ రూపంలో వివరించారు. అగనంపూడి, చిన ముషిడివాడ, రాతి చెరువు, ఆదర్శగ్రామం, రాజీవ్ కాలనీ, ముత్యమాంబ కాలనీ, పైడిమాంబ కాలనీ, చిలకపేట, సీహార్స్, పరవాడ తదితర ప్రాంతాలలో నిర్మాణం పూర్తయిన దాదాపు 5వేల ఇళ్లను త్వరలో లబ్ధిదారులకు అందించే కార్యక్రమంపై చర్చించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మిగిలిన 24 లే-అవుట్లలో ఇళ్ల నిర్మాణం త్వరితగతిగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందించేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించామని, డిసెంబరు 22 నాటికి అన్ని గృహాలను లబ్ధిదారులకు అందించాలన్నది లక్ష్యమని చెప్పారు. బ్యాంకు రుణాలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో టిడ్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ డి.నరసింహమూర్తి, యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్ కె.పాపునాయుడు, కార్యనిర్వాహక ఇంజనీర్ డి.ఎన్.ఆర్.సుధాకర్, జిల్లా కో ఆర్డినేటర్, బ్యాంకు లింకేజ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.