ఏపీలో శాంతి భద్రతలు ఉన్నట్టా లేనట్టా?
ABN , First Publish Date - 2022-05-01T01:14:08+05:30 IST
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై ..
అమరావతి/హైదరాబాద్: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే గాయపడ్డారు. కాగా.. వైసీపీ గ్రామపార్టీ అధ్యక్షుడు గంజిప్రసాద్ను కొందరు దుండగులు నరికి చంపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో గ్రామంలోని వైసీపీ కార్యకర్తలు ఆయన్ను అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. వెంటనే కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు చివరకు పోలీసుల సాయంతో ఎమ్మెల్యే వెంకట్రావు గ్రామం నుంచి బయటకు వెళ్లారు.
గ్రూపు రాజకీయాలను ప్రోత్సాహించడం వల్లనే ఈ హత్య జరిగిందని గ్రామానికి చెందిన కార్యకర్తలు, వైసీపీ నేతలు మండిపడ్డారు. గంజి ప్రసాద్ హత్యకు ఎమ్మెల్యే కారణమంటూ వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. అయితే ఈ ఘటనలో వైసీపీ ఎంపీటీసీ అనుచరులైన ఇద్దరు వ్యక్తులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘‘ఏపీలో శాంతి భద్రతలు ఉన్నట్టా?.. లేనట్టా?. హత్యాచారాలు, దాడులు ఎందుకు కొనసాగుతున్నాయి?. సొంత పార్టీ నేతనే నరికి చంపే కక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి?. వైసీపీ ఎమ్మెల్యేపై సొంత కార్యకర్తలే దాడి చేయడం దేనికి నిదర్శనం?. పోలీసులు కావాలనే నేరాలను పట్టించుకోవడం మానేశారా?. ’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.