నీలమణిదుర్గ ఆలయ ప్రహరీ, సింహద్వారం కూల్చివేత

ABN , First Publish Date - 2021-10-25T09:19:18+05:30 IST

నీలమణిదుర్గ ఆలయ ప్రహరీ, సింహద్వారం కూల్చివేత

నీలమణిదుర్గ ఆలయ ప్రహరీ, సింహద్వారం కూల్చివేత

రహదారి విస్తరణ పనుల్లో యంత్రాలతో తొలగించిన అధికారులు

స్థానికులతో కలిసి టీడీపీ శ్రేణుల నిరసన.. కేసు నమోదు


పాతపట్నం, అక్టోబరు 24: ఆంధ్రా, ఒడిసా ప్రజల ఇలవేల్పు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నీలమణిదుర్గ ఆలయ ప్రహరీ, సింహద్వారం తొలగింపు ప్రభుత్వ దుశ్చర్య అని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఆలయం వద్ద తెలుగుదేశం శ్రేణులు, స్థానికులు ఆదివారం ఆందోళన చేపట్టారు. నరసన్నపేట-పాతపట్నం రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు శనివారం ఆకస్మికంగా యంత్రాలతో ఆలయ ప్రహరీతో పాటు సింహద్వారాన్ని తొలగించారు. దీంతో ఆలయ పరిసరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీనికితోడు ఆలయానికి కూతవేటు దూరంలో ఆంజనేయ, వినాయక గుడులను సైతం తొలగించారు. కనీసం విగ్రహాలను తరలించి, సంరక్షించేందుకు కూడా సమయం ఇవ్వలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. శనివారం రాత్రి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానికులు ఆదివారం ఆందోళన చేపట్టారు. నీలమణిదుర్గ ఆలయంతో పాటు సమీపంలోని ఆంజనేయ ఆలయం వద్ద తొలగింపు ప్రక్రియను పరిశీలించిన రవికుమార్‌ మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణలో నాలుగు అడుగులు తొలగించాల్సి ఉన్నా..15 అడుగులు తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. రెండో వైపు విస్తరించి ఉంటే ఆలయానికి నష్టం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. కాగా.. కొవిడ్‌ నిబంధనలు పాటించలేదని పేర్కొంటూ రవికుమార్‌, వెంకటరమణమూర్తితో పాటు 17మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. 



Updated Date - 2021-10-25T09:19:18+05:30 IST