పోలవరం సంగతేంటి?
ABN , First Publish Date - 2021-11-29T09:10:42+05:30 IST
పోలవరం సంగతేంటి?
నేడు హైపవర్డ్ కమిటీ సమీక్ష
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జాతీయ హోదా ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర హైపవర్డ్ స్టీరింగ్ కమిటీ సమీక్ష జరిపి ఏడాది గడచిపోయింది. నిరుడు నవంబరు 14నాటి సమావేశంలో.. పోలవరం నిర్మాణానికి భూసేకరణ, పునరావాస కార్యక్రమాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కాంక్రీటు పనులకే పెద్దపీట వేస్తోందని.. పునరావాసాన్ని పట్టించుకోవడంలేదని ఆక్షేపించింది. ఆ తర్వాతై నా ఆ దిశగా అడుగు ముందడుగు పడలేదు. సొంత గా ఖర్చుచేయడానికి నిధుల్లేక.. కేంద్రం నుంచి రీయింబర్స్మెంట్ రాక.. ఏడాదిగా పనులు నడవడం లేదు. నిధులు అడిగినప్పుడల్లా కేంద్రం పునరావాసం ఊసెత్తతోంది. తుది అంచనాల ఆమోదం ప్రస్తావనే తీసుకురావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అధ్యక్షతన హైపవర్డ్ స్టీరింగ్ కమిటీ సోమవారం ఢిల్లీలో సమావేశమవుతోంది. వీడియో కాన్ఫరెన్సింగ్ విఽధానంలో జరిగే ఈ సమావేశంలో.. రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి, పోలవరం ప్రా జెక్టు అథారిటీ(పీపీఏ) సీఈవో అయ్యర్, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొంటారు. ఈ సమావేశం లో ఇతర జాతీయ హోదా ప్రాజెక్టుల పురోగతిపైనా సమీక్ష జరుగుతుంది. నిరుడు నవంబరు 14న జరిగిన కమిటీ భేటీ నాటికి పోలవరం హెడ్వర్క్స్ 67ు పూర్తికాగా.. ప్రస్తుతం 75ు వరకు అయ్యాయి. ప్రధాన డ్యాం పనులు 77ు, కనెక్టివిటీ ప్యాకేజీలు 59ు, కుడి ప్రధాన కాలువ పనులు 92ు, ఎడమ కాలువ పనులు 72ు.. మొత్తంగా కాంక్రీటు పనులు 77ు పూర్తయ్యాయి. కానీ భూసేకరణ, పునరావాస కార్యక్రమాలు కదలలేదు. గతేడాది నవంబరు 14నాటికి 20 శాతం పూర్తయిన పనులు.. ఈ ఏడాదికాలంలో అక్కడే ఆగిపోయాయి. భూసేకరణ, సహాయ పునరావాసంతో కలిపితే ప్రాజెక్టు పనులు కేవలం 42 శాతమే పూర్తయినట్లు లెక్క. వాస్తవానికి ఈ ఏడాది జూన్నాటికే ప్రాజెక్టును పూర్తిచేస్తామని సీఎం జగన్ శాసనసభలో చెప్పారు. నిరుడు జూలై 8కల్లా నిర్వాసితులందరికీ గృహాలు నిర్మిస్తామని మంత్రి అనిల్ కుమార్ ప్రకటించారు. ఇప్పటి వరకు అతీగతీ లేదు. నిర్వాసితులకు ఇళ్లూ పూర్తి కాలేదు. ముంపు కుటుంబాలను పునరావాస కాలనీలకూ తరలించలేదు. ఎప్పటికప్పుడు గోదావరి పోటెత్తినప్పుడల్లా నిర్వాసితులను సుదూరంగా తరలించడం సాధారణమై పోయింది. దీనిపై ఇటీవల జాతీయ ఎస్టీ కమిషన్ కూడా కన్నెర్రజేసింది.
రాష్ట్రం కోరుతున్నదేంటి..?
హైపవర్డ్ కమిటీ భేటీలో నిధులు, అంచనాల విషయంలో స్పష్టత కోరాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం 2013-14 అంచనా వ్యయం రూ.20,398.74 కోట్లకే పరిమితమవుతానంటే భూసేకరణ, సహాయ పునరావాసం కూడా ఇవ్వలేమని మరోసారి స్పష్టం చేయనుంది. ఈ నేపథ్యంలో కేంద్రమే సవరించిన అంచనా వ్యయం రూ.47,725 కోట్లు ఇవ్వాలని కోరనుం ది. ‘ఒడిసా, ఛత్తీ్సగఢ్ ప్రభుత్వాలు ముంపు గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేలా కేంద్రం చూడాలి. స్టాప్వర్క్ ఆర్డర్ను ఎత్తివేయాలి. తాగునీటి పథకాన్ని కూడా ప్రాజెక్టులో భాగంగానే గుర్తించి నిధులివ్వాలి’.