నేను కార్పొరేటర్... నన్ను అడిగేదెవరురా?
ABN , First Publish Date - 2022-08-13T08:45:49+05:30 IST
నేను కార్పొరేటర్... నన్ను అడిగేదెవరురా?
ఒంగోలులో వైసీపీ కార్పొరేటర్ భర్త వీరంగం
మద్యం మత్తులో అడ్డొచ్చినవారిపై దౌర్జన్యం
కారు బానెట్పైకెక్కి మరీ బూతు పురాణం
ఒంగోలు కార్పొరేషన్, ఆగస్టు 12: ‘నేను ఈ డివిజన్ కార్పొరేటర్ను. నన్ను అడిగేదెవరురా’ అంటూ వైసీపీ కార్పొరేటర్ భర్త రెచ్చిపోయాడు. మద్యం సేవించి పట్టపగలు నడిరోడ్డుపై వీరంగం వేశాడు. రోడ్డుకు అడ్డంగా కారు ఆపి ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి దిగాడు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పాలక సంస్థలోని 31వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ భర్త తన్నీరు నాగేశ్వరరావుతోపాటు, అతని అనుచరులు శుక్రవారం మద్యం సేవించారు. అనంతరం కారులో నగరంలో చక్కర్లు కొట్టడం ప్రారంభించారు. విజయనగర్ కాలనీలోని రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ పని కోసం వచ్చిన వారు బైక్లు నిలిపి ఉంచడం చూసి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాటిని తీయాలని వాహనదారులతో వాగ్వాదానికి దిగాడు. అతని తీరును ప్రశ్నించినవారిని చొక్కా పట్టుకుని దౌర్జన్యానికి చేశాడు. ఆ సమయంలో ఒకరిద్దరు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా కారు బానెట్పైకి ఎక్కి బూతులు తిడుతూ వీధి రౌడీలా వ్యవహరించాడు. ఒకరిద్దరు చొరవచూపి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అక్కడకు చేరుకుని వీరంగం వేశాడు. నాపై ఫిర్యాదు చేసేందుకు 100కు డయల్ చేసినవారు ఎవరో చెప్పండి, వారి సంగతి తేలుస్తానని స్టేషన్లోనే బెదిరింపులకు దిగడంతో ఫిర్యాదుదారులు వెనక్కితగ్గారు. అధికార పార్టీ అండదండలతోపాటు, తన భార్య కార్పొరేటర్ కావడంతో ఆ డివిజన్లో నాగేశ్వరరావు అన్నీ తానై చక్రం తిప్పుతున్నాడు. ఆ డివిజన్లో ఎవరు కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా, ఏపని జరగాలన్నా ముందుగా ఆయన్ని ప్రసన్నం చేసుకొని ముడుపులు చెల్లించుకోవాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి.