ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాం

ABN , First Publish Date - 2022-08-13T09:04:29+05:30 IST

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాం

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాం

హైకోర్టులో డిస్కమ్‌ల అఫిడవిట్‌ 

బొగ్గు, కరెంటు కొనుగోళ్లలో ఆర్థిక  క్రమశిక్షణ లేనందుకే...: నిపుణులు 


అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): వినియోగదారుల నుంచి నెలవారీ బిల్లులను ముక్కుపిండి వసూలు చేస్తున్న డిస్కమ్‌లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. వాల్వాహన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ సంస్థ హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై దాఖలు చేసిన అఫిడవిట్‌లో డిస్కమ్‌లు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రూరల్‌ ఎలక్ట్రిక్‌ కార్పొరేషన్‌తో సహా వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.38,836 కోట్ల రుణాలు ఉన్నాయని, ప్రభుత్వ శాఖల నుంచి రూ.9,115 కోట్లు రావాల్సి ఉందని వెల్లడించాయి. ప్రభుత్వం రూ.3,087 కోట్ల సబ్సిడీ మొత్తం చెల్లించాల్సి ఉందని పేర్కొన్నాయి. అదేవిధంగా విద్యుత్తు సరఫరా చేసిన సంస్థలకు రూ.13,011 కోట్లు బకాయి ఉన్నట్లు తెలిపాయి. డిస్కమ్‌లు రూ.28,599 కోట్ల మేర నష్టాల్లో మునిగిపోయాయని వెల్లడించాయి. బకాయిలు చెల్లించాలని కోరుతూ విద్యుత్తు సరఫరా సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.. డిస్కమ్‌లు తమ ఆర్థిక కష్టాలను ఏకరువుపెట్టాయి. గత మూడేళ్లలో విద్యుత్తు పంపిణీ సంస్థలు ఆర్థికంగా బలోపేతమయ్యాయంటూ సీఎం జగన్‌ బహిరంగ సమావేశాల్లో చెబుతూ వస్తున్నారు. అందుకు విరుద్ధంగా న్యాయస్థానంలో డిస్కమ్‌లు అఫిడవిట్‌ వేయడంతో... ఎవరి మాట నిజమనే సందేహాలు తలెత్తుతున్నాయి. లాభనష్టాల్లేకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామని చెబుతున్న డిస్కమ్‌లు ఒక్కసారిగా న్యాయస్థానం ఎదుట ఆర్థిక కష్టాలు వల్లెవేయడంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో భారీ ధరలకు విద్యుత్తు కొనుగోలు చేస్తూ ఆ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న డిస్కమ్‌లకు భారీ నష్టాలు ఎందుకు వస్తాయ్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బొగ్గు, కరెంటు కొనుగోళ్లలో ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్లే నష్టాలు వస్తున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు భారీ నష్టాలు వస్తున్నాయంటూనే... ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన రూ.9,115కోట్ల బకాయిలను ఏకమొత్తంలో చెల్లించేందుకు ముందుకు వస్తే 40 శాతం రాయితీ ఇచ్చేందుకు డిస్కమ్‌లు సిద్ధపడటం ఏమిటని నిలదీస్తున్నారు. ప్రజల నుంచి ట్రూఅప్‌ చార్జీల కింద రూ.3,547 (రూ.2910+రూ.637) కోట్లు వసూలు చేసేందుకు సిద్ధపడిన డిస్కమ్‌లు.. ప్రభుత్వ శాఖలు సకాలంలో బిల్లులు చెల్లించకపోతే భారీ జరిమానా వేయాల్సిపోయి ఏకంగా రూ.3,646 కోట్లు మాఫీ చేసేందుకు సిద్ధం కావడం విమర్శలకు తావిస్తోంది. మొత్తానికి న్యాయస్థానంలో డిస్కమ్‌లు దాఖలు చేసిన అఫిడవిట్‌తో సంస్థల ఆర్థిక డొల్లతనం బయటపడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-08-13T09:04:29+05:30 IST