రాష్ట్ర డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2022-08-07T01:15:05+05:30 IST

రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాధ్‌కి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పంపిణీలో వైసీపీ నేతల తీరు లేఖలో ప్రస్తావించారు.

రాష్ట్ర డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

అమరావతి: రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాధ్‌కి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పంపిణీలో వైసీపీ నేతల తీరు లేఖలో ప్రస్తావించారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల, ఎమ్మెల్సీ అంగర పట్ల వైసీపీ నేతల దౌర్జన్యం లేఖలో వివరణ ఇచ్చారు. పెంకులపాడులోని టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల, ఎమ్మెల్సీ అంగరను అడ్డుకున్నారని వెల్లడించారు. ఇద్దరు నేతలను వేదికపైకి వెళ్లకుండా అడ్డుకుని దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ నేతల దాడిలో ఎమ్మెల్యే రామానాయుడుకు గాయాలయ్యాయని చెప్పారు. వైసీపీ అనుచరుల దౌర్జన్యకాండపై ఘటనాస్థలంలోని డీఎస్పీ సహా పోలీసులు స్పందించలేదన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై దాడి జరుగుతున్నా పోలీసులు స్పందించకపోవడం విస్మయం కలిగించిందన్నారు. 


టీడీపీ ప్రజా ప్రతినిధులకు సంబంధించి తీవ్రమైన ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరిగాయని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పోలీసుల సమక్షంలోనే ఇద్దరు ప్రజా ప్రతినిధులకు రక్షణ లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి అలసత్వం ప్రదర్శించిన పోలీసులతో పాటు దాడికి పాల్పడిన వైఎస్‌ఆర్‌సీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. పోలీసులు సమర్థవంతంగా, నిజాయితీగా వ్యవహరించడం ద్వారా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. లేఖతో పాటు నేతలపై దాడికి సంబంధించి వీడియోలు, ఫోటోలు జత చేశారు. 

Updated Date - 2022-08-07T01:15:05+05:30 IST