భోగి మంటల్లో పన్నుల పెంపు ప్రతులు
ABN , First Publish Date - 2021-01-14T07:55:39+05:30 IST
సంస్కరణల పేరిట రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను, ఇతర యూజర్ చార్జీలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య విమర్శించింది.
పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలు
అమరావతి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంస్కరణల పేరిట రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను, ఇతర యూజర్ చార్జీలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య విమర్శించింది. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ స్థానిక సంస్థల్లో చార్జీల పెంపునకు ఉద్దేశించిన మున్సిపల్ చట్ట సవరణలు- 196, 197, 198 జీవోల ప్రతులను భోగిమంటల్లో వేసి దహనం చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ‘సమాఖ్య’ రాష్ట్ర కన్వీనర్ సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ.. ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఆందోళనల్లో సీపీఎం, సీపీఐ నేతలు పాల్గొన్నారు.