మాకే దిక్కులేదు.. ప్రజలకేం చేస్తాం!

ABN , First Publish Date - 2020-12-03T08:46:43+05:30 IST

కరోనా వైర్‌సను ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలపై శాసన మండలిలో బుధవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. బీజేపీ ఎమ్మెల్సీ

మాకే దిక్కులేదు.. ప్రజలకేం చేస్తాం!

మండలిలో వాపోయిన ఎమ్మెల్సీలు 


అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): కరోనా వైర్‌సను ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలపై శాసన మండలిలో బుధవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తన అనుభవాన్ని సభ ముందు ఉంచారు. ‘‘నేనో ప్రజాప్రతినిధిని. కరోనా వచ్చిన మా అత్తను కాపాడుకోలేకపోయాను. నెల్లూరులో ఏ ఆస్పత్రికి ఫోన్‌ చేసినా బెడ్లు ఖాళీ లేవన్నారు. చేసేదేమీ లేక హైదరాబాద్‌ తీసుకెళ్లాం. అప్పటికే సమయం దాటిపోవడంతో మరణించారు. నాకు, నా భార్యకు కూడా బెడ్లు లేకపోవడంతో హైదరాబాద్‌, చెన్నైలో చికిత్స పొందాం. నా ఇంట్లోనే న్యాయం చేయలేకపోయాను. ప్రజలకు ఏం చేస్తా’’ అని వాపోయారు. ‘‘పరీక్ష కోసం నేను సిఫార్సు చేయించుకోవాల్సి వచ్చింది.


కలెక్టర్‌తో చెప్పిస్తావా, ఎమ్మెల్యే, మంత్రితో చెప్పిస్తావా అని అడిగారు. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవాలి’’ అని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అధికార పార్టీ నేతలు సభలు, పాదయాత్రలు నిర్వహించి సూపర్‌ స్ర్పెడర్‌లుగా మారారని మరో టీడీపీ సభ్యుడు జగదీశ్‌ విమర్శించారు. ‘కరోనా ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన పెద్ద విపత్తు. దానిని ఎదుర్కొనేటపుడు చిన్నచిన్న లోపాలు జరిగి ఉండవచ్చు. మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాం’’ అని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 

Updated Date - 2020-12-03T08:46:43+05:30 IST