విధేయులకు పట్టం

ABN , First Publish Date - 2020-10-19T09:55:17+05:30 IST

విధేయులకు పట్టం

విధేయులకు పట్టం

నలుగురు వైసీపీ నేతలకు బీసీ కార్పొరేషన్ల పదవులు

అధికారికంగా ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం


గుంటూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన బీసీ కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకాన్ని ప్రభుత్వం పూర్తిచేసింది. ఆదివారం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాకు చెందిన నలుగురు బీసీ నాయకులకు వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌ పదవులు లభించాయి. నెల క్రితమే వైసీపీ అధిష్ఠానం చైర్మన్ల ఎంపిక కసరత్తు జరిపింది. అప్పుడే చైర్మన్ల పేర్లను ప్రభుత్వానికి పంపించింది. అన్ని అడ్డంకులు తొలగిపోయిన తర్వాత ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పొన్నూరుకు చెందిన షేక్‌ యాసీన్‌కి షేక్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కింది. అలానే బెల్లంకొండ  జడ్పీటీసీ మాజీ సభ్యురాలు దేవళ్ల రేవతికి వడ్డెర కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి లభించింది. కృష్ణ బలిజ/పూసల కార్పొరేషన్‌ చైర్మన్‌గా గుంటూరు నగరానికి చెందిన కోట భవాని నియమితులయ్యారు. కుమ్మర శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌గా బీసీ నాయకుడు మండేపూడి పురుషోత్తం నియమితుడయ్యారు. 


వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఈ నలుగురు నాయకులు పార్టీకోసం శ్రమించారు. వారి సేవలకు గుర్తింపుగా పార్టీ అధికారంలోకి రాగానే నామినేటెడ్‌ పదవులు ఇచ్చి గౌరవిస్తామని పలు సందర్భాల్లో నేతలు హామీలు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం గత ఏడాది అధికారంలోకి రాగా అప్పట్లో ఉన్న చైర్మన్లను తొలగించడం, కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుచేయడంలో కొంతజాప్యం జరిగింది.  కరోనా నేపథ్యంలో బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ మరింత ఆలస్యమైంది. ఎట్టకేలకు గత నెలలో చైర్మన్ల నియామకప్రక్రియని చేపట్టారు. దసరా సందర్భంగా ఇప్పుడు అధికారికంగా ఉత్తర్వులు జారీచేశారు. ప్రతీ కార్పొరేషన్‌లో డైరెక్టర్ల నియామకం కూడా చేపడతామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తద్వారా పార్టీ కోసం కష్టపడిన మరి కొంతమందికి నామినేటెడ్‌ పదవులు లభిస్తాయని చెప్పారు. 


నిధులు కేటాయిస్తేనే ప్రయోజనకరం

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతీ బీసీ కులానికి ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామని చెప్పింది. సీఎం జగన్‌ పలుమార్లు ఈ విషయంపై హామీలు కూడాచేశారు. గతంలో ఫెడరేషన్లుగా ఉన్న వాటిని నేడు కార్పొరేషన్లుగా చేశారు. సాధారణంగా కార్పొరేషన్‌ చేస్తే నిధులు ఎక్కువగా మంజూరు చేస్తారన్న ఆశలు ప్రజల్లో నెలకొన్నాయి. గత ప్రభుత్వ హయాంలో కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయించారు. ఈ నేపథ్యంలో ప్రతీ కార్పొరేషన్‌కి  ఆ సామాజికవర్గం జనాభా మేరకు నిధులు కేటాయించాలన్న డిమాండ్‌ వినిపిస్తోన్నది. లేదంటే బీసీలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. 


Updated Date - 2020-10-19T09:55:17+05:30 IST