ఏపీ కావాలనే కయ్యం పెట్టుకుంటోంది: కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-10-01T23:08:37+05:30 IST

నదీజలాల విషయంలో ఏపీ కావాలనే కయ్యం పెట్టుకుంటోందని, అపెక్స్‌ సమావేశంలో ఏపీ వాదనలకు ధీటైన సమాధానం చెబుతామని

ఏపీ కావాలనే కయ్యం పెట్టుకుంటోంది: కేసీఆర్‌

హైదరాబాద్‌: నదీజలాల విషయంలో ఏపీ కావాలనే కయ్యం పెట్టుకుంటోందని, అపెక్స్‌ సమావేశంలో ఏపీ వాదనలకు ధీటైన సమాధానం చెబుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్టు స్పష్టంచేసే విధంగా సమాచారం సిద్ధం చేయాలని అధికారులకు కేసీఆర్‌ ఆదేశించారు. ఇరిగేషన్‌ అధికారులతో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 6న అపెక్స్ కమిటీకి హాజరుకానున్న నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. సమగ్ర వివరాలతో రావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. 


గతంలో రెండుసార్లు వాయిదా పడిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని అక్టోబరు 6న నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై చర్చించనున్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతోపాటు ఏపీ ఫిర్యాదు చేసిన తెలంగాణ ప్రాజెక్టులు, బోర్డుల అధికారాలు వంటి వాటిపై చర్చించే అవకాశం ఉంది. 


అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఆగస్టు 5న నిర్వహించాలని కేంద్రం తొలుత నిర్ణయించింది. ఈ సమావేశంలో పాల్గొనలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడంతో దాన్ని వాయిదా వేశారు. అనంతరం ఆగస్టు 25న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ముందు కేంద్ర మంత్రికి కరోనా సోకడంతో కౌన్సిల్‌ సమావేశాన్ని వాయిదా వేశారు. అయితే ఈ నెల 6న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు కేంద్రం సమాచారం ఇచ్చింది. 

Updated Date - 2020-10-01T23:08:37+05:30 IST