కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు? ట్విటర్పై AP High Court సీరియస్
ABN , First Publish Date - 2022-01-31T19:09:49+05:30 IST
న్యాయమూర్తులపై అనుచిత పోస్టులను పెట్టిన కేసు విచారణలో భాగంగా ట్విటర్పై హైకోర్టు సీరియస్ అయ్యింది.
అమరావతి : న్యాయమూర్తులపై అనుచిత పోస్టులను పెట్టిన కేసు విచారణలో భాగంగా ట్విటర్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయ్యింది. భారతదేశంలోని చట్టాలు, న్యాయస్థానాలను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ట్విటర్పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. వచ్చే వారం లోపు కౌంటర్ ఫైల్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ట్విటర్లో పోస్టులు డిలీట్ చేసినప్పటికీ.. విపిన్ అని టైప్ చేస్తే వెంటనే వస్తున్నాయని హైకోర్టు న్యాయవాది అశ్విని కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ట్విటర్ వద్ద ఉన్న న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టుల మెటీరియల్ను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. పోలీసులను పంపి స్వాధీనం చేసుకునే ఉత్తర్వులు ఇస్తామని హెచ్చరించింది. న్యాయమూర్తులపై పోస్టులు పెట్టిన విదేశాల్లో ఉన్న వారిని ఎప్పటిలోగా అరెస్టు చేస్తారని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. వచ్చే వారంలో కౌంటర్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.