రికార్డు సృష్టించిన ఏపీజీవీబీ
ABN , First Publish Date - 2021-05-16T06:58:46+05:30 IST
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీవీ).. గడచిన ఆర్థిక సంవత్సరం (2020-21) లో రికార్డు స్థాయిలో రూ.1,009 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది...
- 2020-21 ఆర్థిక సంవత్సర లాభం రూ.1,009 కోట్లు
- రూ.1,000 కోట్ల లాభాన్ని ఆర్జించిన తొలి గ్రామీణ బ్యాంక్గా రికార్డు
హన్మకొండ (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీవీ).. గడచిన ఆర్థిక సంవత్సరం (2020-21) లో రికార్డు స్థాయిలో రూ.1,009 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2019-20 ఆర్థిక సంవత్సర లాభం రూ.617 కోట్లతో పోల్చితే ఇది ఏకంగా 63.53 శాతం అధికమని బ్యాంక్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. భారత్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిన తొలి ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ (ఆర్ఆర్బీ).. ఏపీజీవీబీ అని ఆయన తెలిపారు. కాగా గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణా లాభం రూ.1,213 కోట్ల నుంచి రూ.1,535 కోట్లకు పెరిగిందన్నారు. ఇదే సమయంలో నికర వడ్డీ మార్జిన్ 4.85 శాతంగా ఉన్నాయని ప్రవీణ్ పేర్కొన్నారు. మరోవైపు మార్చి ముగిసే నాటికి బ్యాంక్ మొత్తం ఆదాయం కూడా రూ.3,013 కోట్ల నుంచి రూ.3,448 కోట్లకు పెరిగిందని తెలిపారు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ స్థూల మొండి బకాయిలు (జీఎన్పీఏ) 1.06 శాతంగా ఉన్నాయి. కాగా డిపాజిట్లు 18.07 శాతం వృద్ధి చెంది రూ.21,838 కోట్లకు చేరుకున్నాయి. కొవిడ్-19, లాక్డౌన్ వంటి సవాళ్లను అధిగమించి బ్యాంక్ నిలకడైన వృద్ధిని కనబరిచిందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. మరోవైపు బంగారం విభాగ వ్యాపారం రూ.953 కోట్ల నుంచి రూ.1,876 కోట్ల మేరకు పెరిగిందని చెప్పారు. బ్యాంకు నిర్వహణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచటంతో పాటు ఖాతాదారులకు అత్యుత్తమ సేవలందించే లక్ష్యంతో తెలంగాణలోని భువనగిరి, నాగర్కర్నూల్, ఏపీలోని అనకాపల్లిలో ప్రాంతీయ కార్యాలలయాను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం బ్యాంక్.. తెలంగాణలోని 21 జిల్లా లో 502 శాఖలను, ఏపీలోని 3 జిల్లాల్లో 273 శాఖలను నిర్వహిస్తోంది.