వాహనదారులకు ఏపీ ప్రభుత్వం షాక్

ABN , First Publish Date - 2020-09-18T21:29:11+05:30 IST

వాహనదారులకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రకటిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. దొంగచాటున పన్నుల మోత మోగిస్తోంది. రెండు నెలలు తిరక్కుండానే పెట్రోలు

వాహనదారులకు ఏపీ ప్రభుత్వం షాక్

అమరావతి: వాహనదారులకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రకటిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. దొంగచాటున పన్నుల మోత మోగిస్తోంది. రెండు నెలలు తిరక్కుండానే పెట్రోలు, డీజిల్‌పై మరోసారి కొత్త పన్నును తెరపైకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేయాలనే సాకుతో పెట్రోలు, డీజిల్‌పై రూపాయి చొప్పున సెస్‌ విధించాలని నిర్ణయించింది. పెట్రోల్, హైస్పీడ్ డీజిల్‌పై సెస్ విధిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. వ్యాట్‌కు అదనంగా లీటర్‌ పెట్రోల్, హైస్పీడ్ డీజిల్‌పై రూ.1 సెస్ విధించింది. డీలర్ నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. రహదారి అభివృద్ధి నిధి కోసం సెస్ వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సెస్ ద్వారా రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 


ఈ నెల 3న జరిగిన కేబినెట్‌ సమావేశంలోనే దీనికి ఆమోదముద్ర వేసింది. అయితే వరుసగా పెంచుతున్న పన్నుల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని భావించి.. గోప్యంగా ఉంచింది. ఎట్టకేలకు దీనిపై అధికారికంగా ఈ రోజు జీవో విడుదల చేసింది. అయితే గతంలో ఎప్పుడూ ఈ తరహా పన్ను ప్రజలపై విధించలేదు.  వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి పెట్రోలు, డీజిల్‌పై రూ.2 చొప్పున అదనపు వ్యాట్‌ ఉంది. పెట్రో ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోకుండా అదనపు పన్నును ఒకసారి శాతంలోకి తీసుకెళ్లి, కొన్ని రోజులకే మళ్లీ రూపాయల్లోకి తీసుకొచ్చింది.

Updated Date - 2020-09-18T21:29:11+05:30 IST