ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ
ABN , First Publish Date - 2021-09-06T20:17:10+05:30 IST
ఇంటర్మీడియెట్ ఆన్లైన్ అడ్మిషన్లలో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల నోటిఫికేషన్ను హైకోర్టు కొట్టేసింది.
అమరావతి: ఇంటర్మీడియెట్ ఆన్లైన్ అడ్మిషన్లలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల నోటిఫికేషన్ను హైకోర్టు కొట్టేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి యథావిధిగా అడ్మిషన్లు కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లను అందరి అభిప్రాయాలు తీసుకొని, ఆన్లైన్లో నిర్వహించవచ్చని హైకోర్టు సూచించింది. ఈ విద్యా సంవత్సరానికి గతంలో మాదిరిగా అడ్మిషన్లు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.
ఇంటర్మీడియెట్లో ఆన్లైన్ అడ్మిషన్లకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 13 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఉన్న ఇంటర్ కళాశాలలన్నింటిలోనూ ఆన్లైన్ ప్రవేశాలు ఉంటాయని, ఇందులో రిజర్వేషన్లు వర్తిస్తాయంటూ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు.
తొలివిడత ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ర్టేషన్ వివరాలు ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఉంటాయన్నారు. దరఖాస్తు ఫీజుగా ఓసీ, బీసీలు రూ.100, మిగతా వర్గాలవా రు రూ.50 చెల్లించాలని పేర్కొన్నారు. రెగ్యులర్, ఒకేషనల్ కోర్సుల కోసం రిజిస్ర్టేషన్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు https://bie.ap.gov.in/ వెబ్సైట్లో లేదా 18002749868లో సంప్రదించాలని సూచించారు.