రోలర్ రిలే స్కేటింగ్ పోటీల్లో పుత్తూరు హవా
ABN , First Publish Date - 2021-04-21T06:14:57+05:30 IST
జాతీయస్థాయి రోలర్ రిలే స్కేటింగ్ పోటీల్లో పుత్తూరు క్రీడాకారులు సత్తా చాటడడంతో ఏపీకి గోల్డెన్ బూట్ అవార్డు దక్కింది.
పుత్తూరు, ఏప్రిల్ 20: జాతీయస్థాయి రోలర్ రిలే స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి గోల్డెన్ బూట్ అవార్డు దక్కింది. రాష్ట్ర జట్టు తరపున ప్రాతినిధ్యం వహించిన 20మంది పుత్తూరు క్రీడాకారులు అత్యధిక పాయింట్ల సాధనలో కీలకపాత్ర వహించారు. గోవా రాజధాని పనాజీలో ఈనెల 17 నుంచి 19వతేదీ వరకు జాతీయస్థాయి రోలర్ రిలే స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో పది రాష్ట్రాల నుంచి వందలాది క్రీడాకారులు పాల్గొన్నారు. ఏపీ జట్టులో పుత్తూరుకు చెందిన 20మంది, విజయవాడకు చెందిన 12 మంది, నెల్లూరుకు చెందిన 9మంది, కడప చెందిన ఐదుగురు, అనంతపురానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఉన్నారు. మొత్తం మూడు విభాగాల్లో పోటీలను నిర్వహించారు. ఇందులో భాగంగా క్వార్డ్ స్కేటింగ్(నాలుగు చక్రాల బూట్లు) పోటీల్లో ఏపీకి ప్రథమ, తమిళనాడు ద్వితీయ, పశ్చిమబెంగాల్ తృతీయస్థానం సాధించింది. ఇన్లైన్ స్కేటింగ్(బూటు మధ్యన చక్రాలు) పోటీల్లో మహారాష్ట్ర, జార్ఘండ్, మధ్యప్రదేశ్ విజేతలుగా నిలిచాయి. కాగా, జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటిన ఏపీ జట్టుకు గోల్డెన్ బూట్ అవార్డు దక్కింది. పోటీల్లో పాల్గొనే పుత్తూరు క్రీడాకారులకు సాయం చేసిన దాత పద్మజకు స్థానిక రోలర్ రిలే స్కేటింగ్ కోచ్లు కృతజ్ఞతలు తెలిపారు.