ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ తొలగింపునకు రంగం సిద్ధం!
ABN , First Publish Date - 2020-04-10T19:22:14+05:30 IST
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది..
అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషనర్ నియామక అర్హతలను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. హైకోర్టు జడ్జి హోదా ఉన్న వ్యక్తిని ఎస్ఈసీగా నియమించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కమిషనర్ పదవీకాలం మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ ఫైలును సిద్ధం చేసినట్లు లీకులు వస్తున్నాయి. గవర్నర్ ఆమోదం కోసం జగన్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఫైలును పంపిందని సమాచారం.
అయితే.. ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే రమేష్ కుమార్ని తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. జగన్ సర్కార్ చేస్తున్న ఈ చర్యలు రాజ్యాంగం విరుద్ధమని అని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఇంతవరకూ ఇటు రమేష్ కానీ.. అటు ప్రభుత్వం తరఫున ఎవరూ స్పందించకపోవడంతో క్లారిటీ రాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడంతో నాటి నుంచి నేటి వరకూ రాష్ట్రంలో పెద్ద రగడే జరుగుతోంది. ఆ తర్వాత రమేష్ కుమార్పై సీఎం జగన్ మోహన్ రెడ్డి మొదలుకుని నేతల వరకూ తీవ్ర విమర్శలు గుప్పించడంతో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారం గవర్నర్ హరిచందన్ వద్దకు కూడా చేరింది. అయితే.. ఆ తర్వాత సీఈసీని తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలో నిమ్మగడ్డ విషయంపై అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీలు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో తనకు భద్రత పెంచాలని రమేష్ కుమార్ కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే.