హైకోర్టుకు హాజరైన ఏపీ డీజీపీ... మిగతా కేసుల సంగతేంటని ప్రశ్నించిన హైకోర్టు
ABN , First Publish Date - 2022-09-30T21:43:39+05:30 IST
కర్నూలు కేసులో డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి (DGP Rajendranath Reddy), హైకోర్టు (High Court)కు హాజరయ్యారు.
అమరావతి: కర్నూలు కేసులో డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి (DGP Rajendranath Reddy), హైకోర్టు (High Court)కు హాజరయ్యారు. రేషన్ బియ్యం పేరుతో రైస్ మిల్లర్లను, వాహనదారులను పోలీసులు వేధించడంపై కర్నూలు జిల్లా (Kurnool District) కల్లూరుకి చెందిన సౌదామిని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం డీజీపీని న్యాయస్థానంలో హాజరుకావాలని ఆదేశించారు. కేసు విచారణలో భాగంగా నేడు డీజీపీ హైకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు డీజీపీపై పలు ప్రశ్నించింది. డీజీపీ ఆదేశాలను కిందిస్థాయి అధికారులు పాటించకపోతే ఎలా?.. ఇలా అయితే పోలీస్ శాఖలో క్రమశిక్షణ ఎలా ఉంటుందని డీజీపీని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ కేసులో సస్పెండ్ చేశారు.. మరి మిగతా కేసుల సంగతేంటని ఆయనను కోర్టు ప్రశ్నించింది. కొందరు అధికారులు లాలూచీ పడుతున్నారని కోర్టు సందేహం వ్యక్తం చేసింది. దీనివల్లే విచారణలో కేసులు నిలబడటంలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఫలితంగా బ్లాక్ మార్కెట్ జరుగుతోందని అసహనం వ్యక్తం చేసింది. కోర్టుకి డీజీపీని పిలవడం పనిష్మెంట్ కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. కిందిస్థాయి అధికారులను ఆదేశాలు పాటించాలని చెబుతున్నామని, ఆదేశాలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు. సౌదామిని రైస్ మిల్ దగ్గర స్వాధీనం చేసుకున్న.. బియ్యం వాహనాలను విడుదల చేయాలని జేసీకి ఆదేశాలిచ్చారని, ఆదేశాలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. రేషన్ బియ్యం పేరుతో రైస్ మిల్లర్లను, వాహనదారులను పోలీసులు వేధించడంపై కర్నూలు జిల్లా కల్లూరుకి చెందిన సౌదామిని హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు వ్యతిరేకంగా రైస్ మిల్లులోని 5 వాహనాలను సీజ్ చేశారని పిటిషనర్ పేర్కొన్నారు.