ఇసుక వ్యవహారంపై సీఎం జగన్ తీసుకున్న తాజా నిర్ణయాలివీ..
ABN , First Publish Date - 2020-06-06T02:01:49+05:30 IST
ఇసుక విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై గత కొన్ని రోజులుగా...
అమరావతి : ఇసుక విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇదే విషయమై సొంత పార్టీ నేతలు వ్యతిరేకించడం, ఆరోపణలు చేస్తుండటం.. ఏకంగా మీడియా ముందుకొచ్చి విమర్శలు గుప్పించిన పరిస్థితి. ఇలా సొంత పార్టీ నేతల నుంచే అసంతృప్తి స్వరాలు వినిపించడంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఇసుక విషయమై సంబంధిత మంత్రి, అధికారులతో సుమారు గంటన్నర పాటు జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మంత్రి, అధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు.
బల్క్ ఆర్డర్ ఎత్తేయండి!
కరోనా వైరస్ కారణంగా మాత్రమే రీచ్లన్నీ మూతబడ్డాయని.. ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రారంభమవుతున్నాయని సీఎంకు అధికారులు వివరించారు. వారం, పదిరోజుల్లో రోజుకు 3 లక్షల టన్నులు ఉత్పత్తిని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు ఆదేశాలు ఇచ్చారు. బల్క్ ఆర్డర్కు సరైన నిర్వచనం ఇవ్వాలని.. డిపోల్లో ఇసుకను బాగా అందుబాటులో పెట్టాలని సీఎం సూచించారు. పోర్టల్ నుంచి బల్క్ ఆర్డర్లను తొలగించాలని ఆదేశించారు.
ఒకే రేటు ఉండేలా చూడాలి..!
‘బల్క్ ఆర్డర్లకు అనుమతులను జేసీకి అప్పగించండి. పోర్టల్ ఆన్ చేయగానే వెంటనే నిల్వలు అయిపోతున్నాయన్న భావన పోగొట్టాలి. ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించి బల్క్ బుకింగ్ ఉంటే సూపరింటెండెంట్ ఇంజినీర్, జేసీల ద్వారా అనుమతులు ఇవ్వండి. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ను చేసుకునే అవకాశం ఇవ్వాలి. డిపోల నుంచే ఇసుక సరఫరా చేయాలి. నియోజకవర్గానికి ఒకటే రేటు ఉండేలా చూడాలి. ఇసుక రీచ్ల్లో అక్రమాలు లేకుండా చూడాలి. బుకింగ్ టైం మధ్యాహ్నం 12 గంటలనుంచి సాయంత్రం 6 గంటలవరకూ ఉంచాలి. చిన్న చిన్న నదులనుంచి పక్కనే ఆనుకుని గ్రామాలకు ఎడ్లబళ్ల ద్వారా సొంత అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతించాలి’ అని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇందుకు అధికారులు బదులిస్తూ.. పంచాయతీ సెక్రటరీ నుంచి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తామని స్పష్టం చేశారు. ఎడ్లబళ్ల ద్వారా తీసుకెళ్లి వేరేచోట నిల్వచేసి అక్రమంగా తరలిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్కు అధికారులు తెలిపారు.