తెలంగాణలో సీఐడీ అధికారులు ఏపీ పరువు తీశారు: లోకేశ్
ABN , First Publish Date - 2021-12-13T03:44:29+05:30 IST
సీఐడీని సీఎం ఇంట్రస్ట్ డిపార్ట్మెంట్గా మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణ నివాసంలో..
అమరావతి: సీఐడీని సీఎం ఇంట్రస్ట్ డిపార్ట్మెంట్గా మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణ నివాసంలో సోదాలు చేస్తుండగా తమ విధులకు ఆటంకం కలిగించారని ఆర్కేపై ఏపీ సీఐడీ అధికారులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. మిత్రుడిని పరామర్శించేందుకు వెళ్లిన ABN ఎండీ రాధాకృష్ణపై కేసు అనైతికమన్నారు. విచారణకు సహకరించాలని కోరిన సీఐడీ అధికారులే ఆటంకం కలిగించారంటూ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దారుణమని, తెలంగాణలో సీఐడీ అధికారులు ఏపీ పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికే 2430 జీవో తెచ్చి మీడియా గొంతును జగన్ నొక్కారు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ABN ఎండీపై పెట్టిన అక్రమ జీరో ఎఫ్ఐఆర్ను వెంటనే ఎత్తివేయాలి.’’ అని లోకేశ్ సూచించారు.