ఢిల్లీ వేదికగా అమరావతిపై కుట్రలు
ABN , First Publish Date - 2020-09-19T09:00:08+05:30 IST
రాష్ట్రానికి కల్పతరువు వంటి అమరావతిని ఢిల్లీ వేదికగా నాశనం చేయాలని వైసీపీ ఎంపీలు కుట్రలు చేస్తున్నారని రాజధాని
- వైసీపీ ఎంపీల తీరుపై రాజధాని రైతుల ఫైర్
గుంటూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి కల్పతరువు వంటి అమరావతిని ఢిల్లీ వేదికగా నాశనం చేయాలని వైసీపీ ఎంపీలు కుట్రలు చేస్తున్నారని రాజధాని రైతులు మండిపడ్డారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్తో ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం శుక్రవారం 276వ రోజు కొనసాగింది. 29 గ్రామాల రైతులు, మహిళలు 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ వంటి విషయాలు వదిలేసి అమరావతి భూములపై సీబీఐ విచారణ కోరడంలో కుట్ర దాగుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీల తీరును తప్పుపడుతూ రాయపూడికి చెందిన అసైన్డ్, మైనార్టీ రైతులు కళ్లకుగంతలు కట్టుకుని నిరసన తెలిపారు. పెదపరిమిలో రైతులు మహాధర్నా నిర్వహించారు.
బీజేపీ సైతం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాలపై దాడులు జరుగుతున్న విషయంపై స్పందింస్తున్నంతగా అమరావతిపై ఎందుకు స్పందించరని, ఇప్పటి వరకు 80 మంది వరకు మరణించినా మీకు పట్టదా? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో అమరావతిపై విషం చిమ్ముతున్నారని నీరుకొండ, కృష్ణాయపాలెం, అనంతవరం రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయపోరాటం చేస్తూనే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని ఏపీ పరిరక్షణ జేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు తెలిపారు.