బీజేపీలో చేరినోళ్లు.. తప్పుడు సమాచారమిస్తున్నారు

ABN , First Publish Date - 2020-07-05T08:32:08+05:30 IST

టీడీపీ నుంచి బీజేపీలో చేరిన కొందరు నేతలు ఏపీ ప్రభుత్వ పనితీరుపై బీజేపీ నాయకత్వానికి తప్పుడు సమాచారం అందిస్తున్నారని వైసీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ

బీజేపీలో చేరినోళ్లు.. తప్పుడు సమాచారమిస్తున్నారు

  • కావాల్సిన సమాచారం నేనిస్తా..  
  • కేంద్ర మంత్రి నిర్మలకు మిథున్‌రెడ్డి లేఖ


న్యూఢిల్లీ, జూలై 4(ఆంధ్రజ్యోతి): టీడీపీ నుంచి బీజేపీలో చేరిన కొందరు నేతలు ఏపీ ప్రభుత్వ పనితీరుపై బీజేపీ నాయకత్వానికి తప్పుడు సమాచారం అందిస్తున్నారని వైసీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌ రెడ్డి ఆరోపించారు. వారు గతంలో బీజేపీని దూషించారని, రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత బీజేపీలో చేరారని విమర్శించారు. ఏపీ విషయంలో అభిప్రాయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ‘మీ నాయత్వం పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది. మీకు కావాల్సిన సమాచారం అందించడానికి నేను అందుబాటులో ఉంటాను’ అని పేర్కొన్నారు. విద్యుత్‌రంగంలో ఏపీ ప్రభుత్వ తీరును నిర్మలా సీతారామన్‌ విమర్శించిన సంగతి తెలిసిందే. దానికి సమాధానంగా శనివారం మిథున్‌ రెడ్డి ఆమెకు లేఖ రాశారు. గత ప్రభుత్వ దుష్పరిపాలన వల్ల విద్యుత్‌రంగం సంక్షోభంలోకి వెళ్లడమే కాకుండా డిస్కంలు దివాళా తీసే స్థితికి వెళ్లాయని ఆరోపించారు. ‘మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెట్టడానికి భారీగా ఆర్థిక సహకారం అందించాం. ఈ ఏడాదికి సంబంధించి సబ్సిడీ మొత్తమే కాకుండా గత ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన మొత్తం కలిపి విద్యుత్‌సంస్థలకు రూ.17,904 కోట్లు చెల్లించాం’ అని వివరించారు.

Updated Date - 2020-07-05T08:32:08+05:30 IST