శాసనసభలో మాజీ సీఎం దివంగత రోశయ్య సంతాప తీర్మానం
ABN , First Publish Date - 2022-03-10T19:40:46+05:30 IST
అమరావతి: శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి దివంగత రోశయ్య సంతాప తీర్మానం జరిగింది.
అమరావతి: శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి దివంగత రోశయ్య సంతాప తీర్మానం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నానని చెప్పారు. ఒంగోలులో రోశయ్య కాంశ్య విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రోశయ్య మరణం చాల బాధాకరమన్నారు. ఆయన మంత్రి, ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు చేశారని కొనియాడారు. రోశయ్య మరణాన్ని టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు.
ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ మాట్లాడుతూ.. రోశయ్య మరణవార్త రెండు తెలుగు రాష్ట్రాలలోని చాల మందిని బాధించాయన్నారు. రోశయ్యది రాజకీయ చరిత్ర పుటల్లో విలక్షణమైన పాత్ర అని, ఐదుగురు ముఖ్యమంత్రులతో కలసి పనిచేసిన వ్యక్తి రోశయ్యని కొనియాడారు. వరుసగా ఏడు బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యదేనన్నారు. రోశయ్య ఆర్థిక శాస్త్రం చదవలేదని, ప్రజల జీవితాన్ని చదివారని ఆనం రాంనారాయణ వ్యాఖ్యానించారు.