మూడేళ్లుగా వికేంద్రీకృత పరిపాలన ఉండేలా ప్రభుత్వం కృషి: ఏపీ గవర్నర్

ABN , First Publish Date - 2022-03-07T17:30:08+05:30 IST

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.

మూడేళ్లుగా వికేంద్రీకృత పరిపాలన ఉండేలా ప్రభుత్వం కృషి: ఏపీ గవర్నర్

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంకాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడేళ్లుగా వికేంద్రీకృత పరిపాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, వికేంద్రీకరణతో రాష్ట్రాభివృద్ధి జరుగుతోందన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 0.22 జీఎస్టీపీ వృద్ధి జరిగిందన్నారు. సుపరిపాలన లక్ష్యానికి అనుగుణంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తున్నామని, ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలనా వ్యవస్థ ప్రారంభమవుతుందన్నారు.


ఉద్యోగులకు ఒకేసారి 5 డీఏలు విడుదల చేశామని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు. 11వ పీఆర్సీ అమలు, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచామన్నారు. తలసరి ఆదాయం 15.87 శాతం పెరిగి రూ.2,04,758కి చేరిందన్నారు. నవరత్నాలు ద్వారా మానవ, ఆర్థిక అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. నాడు-నేడు, ఆరోగ్యశ్రీ, బాలామృతం అమలు చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా మూడు వాయిదాలలో.. రూ.13,500 ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. పారదర్శక, అవినీతి రహిత పాలన అందిస్తున్నామని గవర్నర్ బిశ్వభూషణ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-03-07T17:30:08+05:30 IST