ఓఎంఆర్ షీట్ మార్చేశారా..?
ABN , First Publish Date - 2020-10-22T11:23:01+05:30 IST
ఓఎంఆర్ షీట్ మార్చేశారా..?
నీట్ ఫలితాల్లో అన్యాయం జరిగిందని విద్యార్థిని ఆందోళన
557 మార్కులు ఆశిస్తే 113 మార్కులు వచ్చాయని ఆరోపణ
హైకోర్టులో పిటిషన్ వేశానన్న బాధితురాలు
నంద్యాల (ఎడ్యుకేషన్), అక్టోబరు 21: ఇటీవల విడుదలైన నీట్ ఫలితాలలో తన ఓఎంఆర్ షీట్ను తారుమారు చేశారని నంద్యాలకు చెందిన విద్యార్థిని వెంకట వినీల ఆరోపిస్తోంది. నంద్యాల ఎస్బీఐ కాలనీకి చెందిన సుబ్బరాజు, రమాదేవి దంపతుల కుమార్తె వెంకట వినీల. తండ్రి సుబ్బరాజు కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నారు. డెంగీ జ్వరంతో ఉన్నా వినీల పరీక్షకు హాజరైంది. పరీక్ష అనంతరం విడుదలైన కీలో 597 మార్కులు, సెప్టెంబర్ 26న ఎన్టీఏ విడుదల చేసిన కీలో 567 మార్కులు, అనంతరం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కీలో 557 మార్కులు వచ్చాయి. కానీ అక్టోబరు 16న నీట్ ఫలితాలు విడుదల కావడంతో 113 మార్కులు రావడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దీంతో వెబ్సైట్లో విద్యార్థిని ఓఎంఆర్ షీట్ను డౌన్లోడ్ చేసుకున్నాక ఇందులో అక్రమాలు, అవకతవకలు జరిగాయని, తన హాల్ టికెట్ నెంబర్ ఫోర్జరీ చేశారని, హాల్ టికెట్ నంబర్ను బబుల్స్ చేసే విధానంలో తీవ్ర తప్పిదాలు జరిగాయని ఆరోపించింది. డౌన్లోడ్ చేసుకున్న ఓఎంఆర్ షీట్లో జవాబులకు 118 మార్కులు వచ్చాయని, కానీ 113 మార్కులే వచ్చినట్లు ఉందని అంటోంది. తమకు జరిగిన అన్యాయంపై కేంద్ర మానవ వనరుల శాఖకు, ఎన్టీఏ, ఆర్టీఏలకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశానని, ఏపీ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశానని విద్యార్థిని తెలిపింది. న్యాయ పోరాటం చేసి విజయం సాధిస్తానని అంటోంది.