రేపు నారా లోకేశ్ రాక
ABN , First Publish Date - 2020-10-22T10:39:40+05:30 IST
రేపు నారా లోకేశ్ రాక
వర్షాలతో దెబ్బతిన్న పంటలను
పరిశీలించనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి..
బాధిత రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం
అనంతపురం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ జిల్లాలో ఒక రోజు పర్యటన ఖరారైంది. ఈనెల 23న ఆయన జిల్లాకు రానున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ఉదయం 10 గంటలకు గుత్తి సమీపంలోని జిల్లా స రిహద్దుకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు ఘన స్వా గతం పలికేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. నారా లోకేశ్ గుంతకల్లు నియోజకవర్గంలోని ధర్మాపురం, పామిడి మండలంలోని పొగరూరు, పెద్దవడుగూరు మండలం మిడుతూరు, గార్లదిన్నె మండలం రామదాసుపేట, రాప్తాడు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించనున్నారు. బాధిత రైతులతో ఆయన మాట్లాడనున్నారు. వారిలో భరోసా నింపటంతోపాటు క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నారా లోకేశ్ పర్యటన నాలుగు నియోజకవర్గాల్లో సాగనుంది. ఆ మేరకు ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.