చెరువుకట్టపై హత్య కేసు ఛేదింపు
ABN , First Publish Date - 2020-10-22T10:42:06+05:30 IST
చెరువుకట్టపై హత్య కేసు ఛేదింపు
బుక్కరాయసముద్రం, అక్టోబరు 21: బుక్కరాయసముద్రం చెరువుకట్టపై జరిగిన బోయ రమణయ్య హత్య కేసును సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా బుక్కరాయసముద్రం పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో అనంతపురానికి చెందిన రౌడీ షీటర్ గిరీష్ అలి యాస్ గిరిని బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ సాయిప్రసాద్ స్థానిక పోలీసు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. కడప జిల్లా గాలివీడు మండలానికి చెందిన బోయ రమణయ్య అనంతపురం శివారు ప్రాంతాల్లో ఇనుప మంచాలకు బైండింగ్ వైరు అల్లి జీవనం సాగించేవాడు. ఇందులో భాగంగానే ఈ నెల17న రాత్రి బుక్కరాయసముద్రం చెరువు కట్టపై ఉన్న వెంకయ్య స్వామి గుడి వద్ద భోజనం చేసి నిద్రపోయాడు. అదేరోజున రాత్రి అనంతపురం రూరల్ పాపంపేటకు చెందిన రౌడీషీటర్ గీరీష్ అలియాస్ గిరి మద్యం సేవించి, బోయ రమణయ్య వద్ద దొంగతనానికి పాల్పడ్డాడు. నిద్రపోతున్న రమణయ్య మే ల్కుని గిరీష్తో గొడవకు దిగాడు. అనంతరం రమణయ్య తలపై గిరీష్ సిమెంట్ పెల్ల తీసుకుని వేశా డు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆలయం వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీ ద్వారా పరిశీలించగా నిందితుడు గొడవ పడి హత్య చేసినట్లు తేలిందన్నారు. మృతుడి నుంచి నిందితుడు రూ.1800 నగదు, ద్విచక్రవాహనం దొంగలించినట్లు తెలిపారు. బుధవారం అనంతపురం క్రాంతి ఆస్పత్రి వద్ద ఉండగా గిరీష్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడుపై అనంతపురం టూటౌన్ పోలీసుస్టేషన్లో 2012లో ఒక హత్య కేసు, వన్టౌన్, త్రీటౌన్ స్టేషన్లలో దొంగతనం కేసులు నమోదై ఉన్నట్టు తెలిపారు.