కుదరని కాంట్రాక్టు
ABN , First Publish Date - 2020-10-22T10:34:11+05:30 IST
కుదరని కాంట్రాక్టు
నియామకాల్లో గందరగోళం
మూడు నెలల్లో మూడు మెరిట్ లిస్టులు
బేరాలు కుదరకేనని అభ్యర్థుల ఆరోపణలు
జీజీహెచ్లో నర్సింగ్ పోస్టులకు మోక్షం ఎప్పుడో?
గుంటూరు(సంగడిగుంట), అక్టోబరు 21: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిపై చేపట్టిన నర్సింగ్, థియేటర్ అసిస్టెంట్ల నియామక ప్రక్రియలో గందరగోళం నెలకొంది. ఇప్పటి వరకు మెరిట్ లిస్టు లంటూ మూడు నెలల్లో మూడు విడుదల చేశారు. సోమవారం విడుదల చేసిన మూడో జాబితా కూడా తప్పుల తడకగా ఉందనే ఆరోపణలున్నాయి. ఈ విష యం బయటకు పొక్కడంతో నాలుక కరుచుకున్న అధి కారులు మాట మార్చి ఇది మెరిట్ లిస్టు మాత్రమేనని, అభ్యంతరాలుంటే వాటిని పరిగణనలోకి తీసుకుని మరొకటి ఇస్తామని ప్రకటించారు. వాస్తవానికి సోమ వారం విడుదల చేసిన ఽథియేటర్ అసిస్టెంట్ల జాబితాలో ఓసీ మహిళా అభ్యర్థికి రావలసిన పోస్టును వేరే వారికి కేటాయించారని తెలిసింది. ఎస్సీ కేటగిరిలో ఉన్న అభ్యర్థి కి జీరో మార్కులు వస్తే ఉద్యోగం వచ్చినట్లు జాబితా ఉన్నట్లు సమాచారం. అయితే ఆ జాబితాపై జూనియర్ అసిస్టెంట్, ఏడీ, సూపరింటెండెంట్, కలెక్టర్లు సంత కాలు చేశారని తెలిసింది. గందరగోళం నెల కొనడంతో తూచ్ అని ఆ జాబితాను పక్కన పెట్టేశారు. అయితే సంతకాలు చేసిన వారెవ్వరూ కూడా ఆ తప్పులు గమ నించలేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాస్త వానికి ఆ అభ్యర్థికి 70 మార్కులు వచ్చాయని డేటా ఎంట్రీ ఆపరేటర్ పొరపాటుతో సున్నా మార్కులుగా టైప్ చేయడం జరిగిందంటున్నారు. ఇందులోని మతలబు ఏమిటోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ 20న జీజీహెచ్కు కాంట్రాక్టు పద్ధతిపై నర్సుల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చారు. 250 పోస్టులకు 3350 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబరు 28న మొదటి మెరిట్ లిస్టు ఇచ్చారు.. అభ్యంతరాలుంటే తెలపాలని కోరాగా కొంత మంది తెలిపారు. సవరణ జాబితా అంటూ అక్టోబరు 10న మరో జాబితా ఇచ్చారు. మళ్ళీ సవరణ అంటూ 18న మరో జాబితా ప్రకటింటారు. ఇందులో కూడా మార్కు లు సక్రమంగా ఇవ్వలేదని అభ్యర్థులు గగ్గోలు పెట్టడంతో మరలా అభ్యంతరాలుంటే తెలపాలని కోరారు. ఇదే సమ యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 120 నర్సింగ్ ఉద్యో గులకు నియామకాలు చేపట్టి, పూర్తి చేసి అభ్యర్థులతో ఉద్యోగాలు కూడా చేయించుకుంటుంది. కానీ జీజీహెచ్ అధికారులకు మాత్రం ఐదు నెలలుగా శాస్త్రీయ పద్ధతిలో మెరిట్ లిస్టు తయారు చేయడంలోనే విఫలమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు.
జరుగుతున్నదేమిటి..?
అయితే జాబితాలు రూపొందించడం.. గందరగోళం నెలకొనడం.. తూచ్ అని ప్రకటించడం జీజీహెచ్ నియాకాల్లో పరిపాటిగా మారింది. జీజీహెచ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇంచుమించు ఒకే సమయంలో నర్సింగ్ పోస్టుల నియామకం చేపట్టాయి. అర్హత ప్రాతిపదిక ఒకటే కావడంతో ఒకే అభ్యర్థులు మెరిట్లో ఉన్నారు. అయితే డీఎంహెచ్వో కార్యాలయం నిర్వహిం చిన దానిలో పోస్టులు పొందిన వారు అందరూ వారి వారి కేంద్రాలకు వెళ్ళి నిధులు నిర్వహిస్తున్నారు. అదే 120 మంది ఇక్కడ కూడా మెరిట్లో ఉన్నారు. కాలయాపన చేస్తే వారంతా తిరిగి రారని, వారి తర్వాత మెరిట్లో ఉన్న మరో 120 మందికి అవకాశాలు వస్తాయని వారికి ఆశచూపి ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే తప్పుల తడకతో కూడిన జాబితాలు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.