చెరువులో పడి యువతి మృతి
ABN , First Publish Date - 2020-09-21T11:51:53+05:30 IST
చెరువులో పడి యువతి మృతి
పలమనేరు రూరల్, సెప్టెంబరు 20 : రెండురోజుల క్రితం అదృశ్యమైన యువతి పట్టణ సమీపంలోని గొబ్బిళ్లకోటూరు వద్దనున్న ఓ చెరువులో పడి మృతిచెందింది. ఈ విషయం ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. పలమనేరులోని పెద్దగాండ్ల వీధికి చెందిన గుణశేఖర్ కుమార్తె నిఖిత (23) మూర్చవ్యాధితో బాధపడు తోంది. రెండురోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గొబ్బిళ్లకోటూరు వద్దనున్న కొత్తకుంట చెరువులో ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఎస్ఐ నాగరాజు తన సిబ్బంది అక్కడకు చేరుకొని మృతదేహాన్ని వెలికి తీయించారు. పరిశీలించగా నిఖిత మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.