పాజిటివ్.. 9.63 శాతమే
ABN , First Publish Date - 2020-09-21T09:58:41+05:30 IST
పాజిటివ్.. 9.63 శాతమే
6,041 శాంపిల్స్ ఫలితాల విడుదల
జిల్లాలో 582 మందికి కరోనా వైరస్
గుంటూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 582 మంది కరోనా బారిన పడ్డారు. ఆదివారం ఉదయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లో 6,041 శాంపిల్స్ ఫలితాలు రాగా అందులో 9.63 శాతం మందికి పాజిటివ్ వచ్చింది. 90.37 శాతం(5,459) మందికి నెగెటివ్ వచ్చింది. ఇప్పటి వరకు కొవిడ్-19 నుంచి 37,891(74.20 శాతం) మంది కోలుకోగా ఇంకా 12,617(24.71 శాతం) మంది పోరాడుతున్నారు. ఆదివారం ఇద్దరు చనిపోగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 557కి చేరింది. ఆదివారం కొత్తగా 5,967 శాంపిల్స్ని వివిధ ప్రాంతాల్లో టెస్టింగ్ నిమిత్తం సేకరించారు. ఆదివారం గుంటూరులో 141, నరసరావుపేటలో 53, తెనాలిలో 46, బాపట్లలో 45, తాడేపల్లిలో 29, గుంటూరు రూరల్లో 28, పెదకాకానిలో 19, మంగళగిరిలో 18, తాడికొండలో 18, వట్టిచెరుకూరులో 10, మాచర్లలో 31, నకరికల్లులో 10 మందికి మిగిలిన మండలాల్లో మరో 134 మందికి కొవిడ్-19 సోకింది.
కరోనాతో ఆప్తమాలజీ అసిస్టెంట్ మృతి
వినుకొండ: వినుకొండ ప్రభుత్వ వైద్యశాల ఆప్తమాలజీ అసిస్టెంట్ షేక్ అబ్దుల్ఖాదర్(55) కరోనాతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తుళ్లూరు నుంచి నూజెండ్ల ప్రభుత్వ వైద్యశాలకు బదిలీపై వచ్చిన ఖాదర్ డిప్యూటేషన్పై కొంతకాలంగా వినుకొండలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 14న అనారోగ్యానికి గురయ్యాడు. పరీక్షించగా కరోనాగా తేలడంతో గుంటూరు సమీపంలోని కాటూరి మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వైద్యశాలలో ఓ వైద్యుడికి కూడా కరోనా సోకిందని తెలియడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.