అమరావతిని ఆదుకోండి
ABN , First Publish Date - 2020-09-21T09:59:45+05:30 IST
అమరావతిని ఆదుకోండి
రాజధానిపై విషం చిమ్మితే చరిత్రహీనులు
భూములు ఇచ్చిన వారిని సాధిస్తోన్న పాలకులు
278వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు, మహిళలు
తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి క్రైమ్, తాడికొండ, సెప్టెంబరు 20: వైసీపీ ప్రభుత్వంలో నాశనం కాబోతున్న అమరావతిని ఆదుకోవాలని ఆ ప్రాంత రైతులు, మహిళలు డిమాండ్ చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా చేయాలనే డిమాండ్తో చేస్తోన్న ఉద్యమం ఆదివారంతో 278వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని అమరావతిపై విషం చిమ్మితే పాలకులు చరిత్ర హీనులుగా మిగులుతారన్నారు. భూములు ఇచ్చిన వారిపై ప్రభుత్వాలు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాయని వాపోయారు. అధికారంలోకి వచ్చాక అమరావతిని అందనంత అభివృద్ధి చేస్తామన్న వైసీపీ నాయకులు అధఃపాతాళానికి తీసుకెళ్తున్నారన్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తే రాష్ట్ర అభివృద్ధికి అనేక మార్గాలు దొరుకుతాయన్నారు. ఉద్దండ్రాయునిపాలెంలో జేఏసీ సభ్యులు పులి చిన్నా, మహిళలు, రైతులు తదితరులు అమరావతి కొనసాగాలని పోలేరమ్మకు పొంగళ్లు పెట్టారు.
- మూడు రాజధానుల ప్రకటనను విరమిం చాలని తాడేపల్లి మండలం పెనుమాక ఐకాస ప్రతినిధులు డిమాండ్ చేశారు. 278వ రోజుకు చేరిన నిరసన దీక్షలో కళ్లం రాజశేఖర్రెడ్డి, దండమూరి శ్రీహరి, సాబ్జాన్, ఎర్రపీరు, మారుతీ, పుల్లారెడ్డి, పలగాని సాంబశివరావు, ఎం సదా, స్థానిక రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- పెనుమాకలో దీక్షలు చేస్తున్న రైతులకు మంగళగిరి నియోజకవర్గ ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పాలెపు రామారావు, ఎండీ ఇబ్రహీం, వల్లూరి సూరిబాబు, పాతర్ల రమేష్, పఠాన్ ఖాసింఖాన్, నూతక్కి ఏడుకొండలు, వాకా రామ్గోపాల్గౌడ్, దండమూడి ఉమ, కృష్ణవందన, రమాదేవి, అక్కినేని సుబ్రహ్మణ్యం, వీరకృష్ణ, కంచర్ల శివప్రసాద్, కమలనాభుడు, నరసింహరావు, సూర్యనారాయణ పాల్గొన్నారు.
- అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి గ్రామాల్లో రిలే దీక్షలు 278వ రోజుకు చేరాయి. దీక్షల్లో నరసింహస్వామి, వెంకటేశ్వరరావు, ఆర్ రామారావు, బుర్రి సత్యనారాయణ పాల్గొన్నారు.
- అమరావతే ఊపిరిగా జీవిస్తున్నామని తాడికొండ మండలం మోతడకలో జరిగిన దీక్షలో రైతులు, మహిళలు తెలిపారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, రాజధాని రైతులకు మద్దతుగాగ్రామంలో ఆదివారం రాత్రి నిరసన తెలిపారు.