విహారయాత్రలో విషాదం

ABN , First Publish Date - 2020-09-21T09:37:13+05:30 IST

విహారయాత్రలో విషాదం

విహారయాత్రలో విషాదం

అదుపు తప్పి జలపాతంలో పడి యువకుడు మృతి


గాలివీడు, సెప్టెంబరు 20: మిత్రులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ యువకుడు జలపాతంలో పడి మృత్యుఒడికి చేరుకున్న విషాదకర సంఘటన మండలంలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం రెడ్డిపల్లె గ్రామానికి చెందిన లక్ష్మినారాయణ కుమారుడు పవన్‌కుమార్‌ (22) తన మిత్రులతో కలిసి గాలివీడు మండలంలోని తూముకుంట జలపాతానికి విహారయాత్రకు వచ్చి అదుపు తప్పి గుండాలవంకలో పడి మృత్యువాత పడ్డాడు. సంఘటనకు సంబంధించి స్థానిక ఎస్‌ఐ ఇనాయతుల్లా తెలిపిన మేరకు వివరాలిలా.. శనివారం మధ్యాహ్నం పవన్‌కుమార్‌ తన ఏడుగురు మిత్రులతో కలిసి మండలంలోని తూముకుంట వాటర్‌ ఫాల్స్‌ వద్దకు చేరుకున్నాడు. సాయంత్రం వరకు జలపాతంలో కేరింతలు కొడుతూ ఉల్లాసంగా గడిపారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలతో జలపాతం వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో పవన్‌కుమార్‌ అదుపు తప్పి సుమారు 40 మీటర్ల లోతులో పడిపోయాడు. ఈ విషయం  కుటుంబ సభ్యులకు తెలి యడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు చుట్టుపక్కల అన్వేషించి ఆదివారం ఉదయం స్థానికుల సహకారంతో మృతదేహాన్ని వెలికితీశారు. విహారయాత్రకు వెళ్లి తిరిగి ఇంటికొస్తాడనుకున్న కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2020-09-21T09:37:13+05:30 IST