ఢిల్లీకి ఎవరైనా వెళ్ళవచ్చు: భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2022-03-16T21:26:04+05:30 IST

ఢిల్లీకి కాంగ్రెస్ నాయకులు ఎవరైనా వెళ్ళవచ్చని, వెళతామని చెప్పవచ్చని

ఢిల్లీకి ఎవరైనా వెళ్ళవచ్చు: భట్టి విక్రమార్క

హైదరాబాద్: ఢిల్లీకి కాంగ్రెస్ నాయకులు ఎవరైనా వెళ్ళవచ్చని, వెళతామని చెప్పవచ్చని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంపై ఆయన వివరణ ఇచ్చారు. సీఎల్పీ సమావేశంలో సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరిచామన్నారు.  రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం అని చర్చించామన్నారు. దేశంలో అనేక రకాల విధ్వంస చర్యలు, మత పరమైన హింసలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని కాపాడాలంటే పార్టీ పగ్గాలు చేపట్టాలని  రాహుల్‌ను కోరామన్నారు. దానికి అనుగుణంగా తాము రెజల్యూషన్ పాస్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఏ పదవులు ఆశించకుండా రాహుల్ ఇంతకాలం పనిచేశారన్నారు. పార్టీ నిర్మాణం కోసం మళ్లీ రాహుల్ పగ్గాలు చేపట్టాలని కోరుతున్నామన్నారు.


కపిల్ సిబాల్ వంటి నాయకులు మేధావులుగా పని చేసినప్పటికీ, గాంధీ కుటుంబమే దేశాన్ని కాపాడిందని ఆయన పేర్కొన్నారు. గాంధీ కుటుంబం కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడం వల్లే వాళ్ళు కేంద్ర మంత్రులయ్యారన్నారు. మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంలో కూడా ఇదే అంశంపై చర్చించామన్నారు. దేశానికి గాంధీ కుటుంబమే శ్రీరామా రక్ష అని భావిస్తున్నామన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌పై వీహెచ్ వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తనకు తెలీదని ఆయన స్పష్టం చేశారు.  తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు. 2023-24లో రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-03-16T21:26:04+05:30 IST