HYD : Any Time బెల్ట్షాపులు ఓపెన్ .. గుట్టుగా గంజాయి కూడా.. మత్తులో యువత.. చోద్యం చేస్తున్న పోలీసులు
ABN , First Publish Date - 2022-03-22T20:15:33+05:30 IST
HYD : Any Time బెల్ట్షాపులు ఓపెన్ .. గుట్టుగా గంజాయి కూడా.. మత్తులో యువత.. చోద్యం చేస్తున్న పోలీసులు
హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా బెల్ట్షాపులు నిర్వహిస్తున్నారు. బెల్ట్ షాపులు, గుడుంబా బస్తీల్లోని పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. గుట్టుగా గంజాయి సరఫరా అవుతుండడంతో యువత నిత్యం మత్తులో మునిగి తేలుతున్నారు. గతంలో మద్యం మత్తులో అనేక హత్యలు, కొట్లాటలు జరిగినా పోలీసులు చోద్యం చూస్తున్నారు.
హైదరాబాద్ సిటీ/ మియాపూర్ : మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, అమీన్పూర్ పోలీస్స్టేషన్ల పరిధిలో రాత్రీ పగలు తేడాలేకుండా బెల్ట్షాపులు తెరిచి ఉండడం, విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతుండడంతో యువత మత్తులో మునిగి తెలుతున్నారు. పాపిరెడ్డికాలనీలో ఇటీవల ఓ బెల్ట్షాపులో మద్యం తాగిన యువకుడిని అతిదారుణంగా హత్య చేశారు. ఇక్కడ బెల్డ్ షాపు వల్ల నిత్యం యవకుల మధ్య, భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఎక్కువయ్యాయి. పలు సందర్భాల్లో ఇక్కడ అక్రమ మద్యం, గంజాయి, గుట్కా పట్టుబడి, కేసులు నమోదయ్యాయి. అయినా, చందానగర్ పోలీసులు వీటిని అరికట్టడంలో విఫలమవుతున్నారు.
గోపన్పల్లి, మియాపూర్, న్యూకాలనీ, ఎంఏ నగర్, హఫీజ్పేట్ మంజీరా పైపులైన్, స్టాలిన్నగర్, పోగుల అంజయ్యనగర్, హెచ్ఎంటీ మక్తా, సుభా్షచంద్రబోస్ నగర్, తెల్లాపూర్ రోడ్డు ప్రేమ్నగర్ కాలనీ బీబ్లాక్ రోడ్డు, అంజయ్యనగర్, వాణీనగర్, అమీన్పూర్ బాచుపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా బెల్ట్షాపులు ఉన్నాయి. ఇక్కడి నిర్మానుష్య ప్రదేశాల్లో బాటసారులు, వాహనదారులపై మందుబాబులు దాడులు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
నిర్మానుష్య ప్రదేశాల్లో..
గోపన్పల్లి, నల్లగండ్ల పాపిరెడ్డికాలనీ, ప్రేమ్నగర్ బీబ్లాక్, ఎంపీనగర్, వాణీనగర్, అమీన్పూర్ చెరువు ప్రాంతాల్లో ఉన్న నిర్మానుష్య ప్రదేశాల్లో మద్యం మత్తులో దాదాపు 15కు పైగా హత్యలు జరిగాయి. పండుగలు, వీకెడ్స్లో మద్యం షాపులు మూసివేసినప్పుడు బ్లాక్ దందా జోరుగా నడుస్తోంది. అసలు ధరకంటే రెండు రెట్లు ధర పెంచి మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిందంతా బెల్ట్ షాపులకే మందుబాబులు ఖర్చు చేస్తున్నారు. దీంతో పచ్చని సంసారాలు వీధిన పడుతూ పోలీ్సస్టేషన్ మెట్లెక్కుతున్నాయి. కాసులకు కకుర్తిపడి నెల మాముళ్ళు వసులు చేస్తున్న కొందరు పోలీసుల వల్లే బెల్ట్షాపులు జోరుగా నడుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అక్రమంగా మద్యం, గుండుంబా, గంజాయి విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.