కల్లాల నిర్మాణాల్లో కదలిక ఏదీ?

ABN , First Publish Date - 2022-04-23T06:22:42+05:30 IST

రైతులు తమ పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు పొలాల వద్దనే కల్లాల నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.

కల్లాల నిర్మాణాల్లో కదలిక ఏదీ?
దోమకొండ మండలంలోని గొట్టుముక్కలలో రైతుకల్లాల కోసం తవ్వి వదిలేసిన దృశ్యం

- జిల్లాలో ముందుకు సాగని కల్లాల నిర్మాణం

- నిర్మాణంపై ఆసక్తి చూపని రైతులు

- అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం

- ఇప్పటి వరకు నిర్మించినవి 980 మాత్రమే

- జిల్లాకు మంజూరైనవి 2,130


కామారెడ్డి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): రైతులు తమ పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు పొలాల వద్దనే కల్లాల నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. లబ్ధిదారుడి భాగస్వామ్యంతో చేపడుతున్న వీటి నిర్మాణానికి జిల్లాలో ఆధరణ కరువైంది. నిర్మించిన వాటికి ఓ వైపు బిల్లులు సకాలంలో రాకపోవడం, కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే వదిలిపెడుతున్నారు. కల్లాల నిర్మాణాల కోసం సరైన అవగాహన కల్పించకపోవడంతో రైతులు ముందుకు రావడం లేదనే వాదన వినిపిస్తోంది. ప్రధానంగా వరి, కంది, మొక్కజొన్న వంటి పంటలు తీసుకువచ్చిన ప్రతీసారి వాటిని ఆరబెట్టుకునేందుకు రైతులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్లాల్లో పంటలను నూర్పుడి చేసి దిగుబడిని తీసుకునేవారు. ఏటా ఇదే సమస్య ఉత్పన్నమవుతుండడంతో శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కల్లాల కోసం రైతులు దరఖాస్తు చేసుకున్న నిర్మాణాలు మాత్రం ముందుకు కదలడం లేదు.

మంజూరు కొండంత.. పూర్తయింది గోరంత

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపట్టిన రైతు కల్లాల నిర్మాణాలు జిల్లాలో ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో కల్లాల నిర్మాణాల కోసం వ్యవసాయశాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. అయితే వీటి నిర్మాణాలను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయడంతో ఈజీఎస్‌ అధికారులు కల్లాల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో సుమారు 2,400 కల్లాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం 2,130 మంజూరు చేసింది. ఇందులో 2,090 కల్లాల నిర్మాణాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం 980 మాత్రమే పూర్తయ్యాయి. నిర్మాణాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో పాటు చైతన్య పరచడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు.

నిర్మించిన వాటికి అందని బిల్లులు

రైతు కల్లాల నిర్మాణం కోసం దరఖాస్తు అందించడంలో చూపిన శ్రద్ధ వాటి నిర్మాణాలను చేపట్టడంలో రైతులు చూపడం లేదు. కల్లాల కొలతలను బట్టి ఒక్కో దానికి రూ.55వేలు, రూ.65 వేలు, రూ.75వేలుగా నిర్ణయించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత రైతు బ్యాంకు ఖాతాలోనే జమచేస్తారు. ఇందులో ఎస్‌సీ, ఎస్‌టీ రైతులకు 100 శాతం, బీసీ రైతులకు 90శాతం బిల్లులు వస్తున్నాయి. అయితే ముందుగా సొంత ఖర్చులతో నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో కల్లాల నిర్మాణానికి కొందరు రైతులు ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. సొంతడబ్బులతో నిర్మాణాలు చేపట్టారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 980 కల్లాల నిర్మాణాలు అయ్యాయి. ఇందులో చాలా మంది రైతులు తమ సొంత డబ్బులతో మొదట నిర్మించుకున్నారు. బిల్లుల కోసం దరఖాస్తులు పెట్టుకున్న చాలా మందికి బిల్లులు మంజూరు కావడం లేదని బాధిత రైతులు చెబుతున్నారు. దీంతో మిగతా రైతులు కల్లాల నిర్మాణానికి ముందుకు రావడం లేదనే వాదన వినిపిస్తోంది.

ఆసక్తి చూపని రైతులు

కల్లాల నిర్మాణంపై అవగాహన లేకపోవడం, నిర్మించిన వాటికి సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో రైతులు ఆసక్తి చూపడం లేదనే వాదన వినిపిస్తోంది. దీనికి తోడు ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు కావాల్సి ఉండడంతో నిర్మాణం పూర్తయినా సకాలంలో డబ్బులు రావనే అనుమానంతో రైతులు అనాసక్తి చూపుతున్నారు. కొంత మంది రైతులు నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వస్తున్నా సర్వే నెంబర్‌ ఆధారంగా నిర్ధేశించిన ప్రదేశాల్లోనే నిర్మాణాలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరం లేనిచోట నిర్మాణాలు చేపడితే ఉపయోగం ఏమిటని గమ్మున ఉండిపోతున్నారు. ఇంటి వద్దే నిర్మాణానికి అనుమతించాలని కోరుతుండగా దరఖాస్తులో పేర్కొన్న సర్వే నెంబర్‌లోనే నిర్మాణాలను చేపట్టాలని అధికారులు మెలిక పెడుతున్నారు. రైతులు దరఖాస్తుల్లో పేర్కొన్న భూములు దూర ప్రాంతాల్లో ఉండడం, చాలా మంది రైతుల భూముల్లోకి నిర్మాణ మెటీరియల్‌ వెళ్లే దారి సౌకర్యం కూడా లేదు. దీంతో జిల్లాలో కల్లాల నిర్మాణ లక్ష్యం నెరవేరడం లేదు. దరఖాస్తు సమయంలోనే రైతులకు అన్ని విషయాలు స్పష్టంగా వివరించకపోవడంతో మంజూరై ఉన్న వాటి నిర్మాణాలు సైతం మొదలు పెట్టడం లేదు.

Updated Date - 2022-04-23T06:22:42+05:30 IST