చమురు ధరల పెరుగుదలకు విరుగుడు చెప్పిన బెంగాల్ గవర్నర్
ABN , First Publish Date - 2022-04-11T21:53:32+05:30 IST
జురోజుకూ పెరుగిపోతున్న చమురు ధరలకు పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్దీప్...
కోల్కతా: రోజురోజుకూ పెరిగిపోతున్న చమురు ధరలకు పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ విరుగుడు చెప్పారు. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడమే దీనికి పరిష్కారమని సూచించారు. గత 16 రోజులుగా చమురు ఉత్పత్తులు పెరుగుతూ వస్తుండటంతో కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.115,12కు, డీజిల్ ధర రూ.99.83కు చేరింది. పెట్రోలియం కన్జర్వేషన్పై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), ఇతర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్వహించిన ఒక కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చమురు ధరల పెరుగుదలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పెరిగిన ప్రతి పైసాకు తగ్గట్టుగా వినియోగాన్ని ప్రజలు తగ్గించుకుంటూ పోతే అదే సరైన పరిష్కారమవుతుందని అన్నారు. ఇంధన వినియోగాన్ని తగ్గిస్తే ప్లానెట్కు మేలు చేసిన వాళ్లమవుతావని, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి వల్ల దేశ వనరులు తగ్గుతాయని, వినియోగం తగ్గడం ద్వారా దిగుమతులు తగ్గితే ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేసిన వాళ్లమవుతామని అన్నారు.