వ్యవసాయ వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి
ABN , First Publish Date - 2021-01-25T05:45:35+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు.
నల్లగొండ రూరల్ / మిర్యాలగూడ, జనవరి 24 : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. చట్టాల రద్దు కోరుతూ జనవరి 1వ తేదీన చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం జిల్లాకేంద్రానికి చేరుకుంది. బస్సు యాత్రకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. గడియారం వద్ద ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ వ్యవసాయ వ్య తిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారని, రాష్ట్రంలో సైతం అదేవిధంగా పోరాటాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాలతో రైతులు ప్రదర్శన చేయాలన్నారు. సభలో నాయకులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, శోభన్నాయక్, బండ శ్రీశైలం, నాగిరెడ్డి, వీరపల్లి వెంకటేశ్వర్లు,కట్ట నర్సింహ, నారాయణరెడ్డి, సయ్యద్ హాశం పాల్గొన్నారు. అంతకుముందు బస్సుయాత్ర మిర్యాలగూడ పట్టణంలో కొనసాగింది. కార్యక్రమంలో రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శులు భూపాల్, సాగర్, జిల్లా కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి, బండ శ్రీశైలం పాల్గొన్నారు.
నిడమనూరు / హాలియా : దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ, కార్మిక చట్టాలు తెచ్చిందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ అన్నారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్మిక, కర్షక పోరు యాత్ర ఆదివారం నిడమనూరు, హాలియా మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భూపాల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.