ముస్లిం వ్యతిరేక నినాదాలు... బీజేపీ మాజీ అధికార ప్రతినిధి అరెస్ట్...

ABN , First Publish Date - 2021-08-10T20:11:09+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన

ముస్లిం వ్యతిరేక నినాదాలు... బీజేపీ మాజీ అధికార ప్రతినిధి అరెస్ట్...

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన భారత్ జోడో ఆందోళన్ కార్యక్రమంలో ముస్లిం వ్యతిరేక నినాదాల కేసులో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అశ్వినితోపాటు మరొక ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సంఘటనలో వీరి ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


జంతర్ మంతర్ వద్ద ఆదివారం జరిగిన భారత్ జోడో ఆందోళన్ కార్యక్రమంలో కొందరు ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసినట్లు కనిపించే ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ఢిల్లీ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. 


భారత్ జోడో ఆందోళన్ మీడియా ఇన్‌ఛార్జి షిప్ర శ్రీవాస్తవ మాట్లాడుతూ, అశ్విని ఉపాధ్యాయ్ నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం జరిగిందన్నారు. ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసినవారితో తమకు సంబంధం లేదన్నారు. వలస చట్టాలకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం జరిగిందన్నారు. 222 బ్రిటిష్ చట్టాలను రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. తాము ఆ వీడియోను చూశామని, కానీ అందులో ముస్లిం వ్యతిరేక నినాదాలు చేస్తున్నవారెవరో తమకు తెలియదని చెప్పారు. అటువంటి నినాదాలు చేసినవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 


అశ్విని ఉపాధ్యాయ్ కూడా ముస్లిం వ్యతిరేక నినాదాల సంఘటనను ఖండించారు. ఆ వీడియోను పరిశీలించి, ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరానని తెలిపారు. ఆ నినాదాలు చేసినవారిని తాను ఎన్నడూ చూడలేదని, కలవలేదని, వారిని తాను అక్కడికి పిలవలేదని చెప్పారు. తాను అక్కడ ఉన్నంత వరకు వారు తనకు కనిపించలేదన్నారు. అది బూటకపు వీడియో అయితే దర్యాప్తు చేయాలన్నారు. భారత్ జోడో ఆందోళన్ కార్యక్రమాన్ని అపఖ్యాతిపాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 


Updated Date - 2021-08-10T20:11:09+05:30 IST