మోదీకి అన్నదాతల ఉసురు తగులుతుంది
ABN , First Publish Date - 2021-10-19T05:04:01+05:30 IST
మోదీకి అన్నదాతల ఉసురు తగులుతుంది
రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రం
ఖమ్మం రైల్వేస్టేషన్ వద్ద విపక్షాల ఆందోళన
అడ్డుకున్న పోలీసులు, స్వల్ప ఉద్రిక్తత
ఖమ్మం కలెక్టరేట్, అక్టోబర్ 18: రైతు వ్యతిరేక విధానా లను అవలంబిస్తూ.. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్న ప్రధాని మోదీకి రైతుల ఉసురు తగులుతుందని విపక్ష నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు సోమవారం వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలో రైల్రోకోకు ప్రయత్నించారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రదర్శనగా వచ్చిన విపక్షాల నేతలు రైల్వేస్టేషన్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిం చగా ఖమ్మం ఏసీపీ ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్రంగా తోపులాట జరిగి.. పరిస్థితులు ఉద్రిక్తతగా మారడంతో నాయకులు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశంలో మోదీ నేతృత్వంలో బీజేపీ అరాచక పాలన సాగిస్తోందని, దేశసంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ దాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలను చంపేందుకు కూడా వెనుకాడడడం లేదన్నారు. లిఖింపూర్ ఘటనకు కారకులైన కేంద్ర హోంశాఖ సహాయశాఖ మంత్రి అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా నల్లచట్టాలను రద్దుచేసే వరకు పోరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులను అడ్డుకోవడం ద్వారా సీఎం కేసీఆర్.. మోదీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఈ నిరసనలో విపక్షాల నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్, గోకినపల్లి వెంకటేశ్వరరావు, మాదినేని రమేష్, మక్కా శేఖర్గౌడ్, జమ్ముల జితేందర్రెడ్డి, శింగు నర్సింహారావు, ఎస్కే జానిమియా, అడపా రామకోటయ్య, గోవిందరావు, దొండపాటి రమేష్, సిద్దినేని కర్ణకుమార్, యర్రా శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.