Hyderabad వాసులకు మరో షాకింగ్ న్యూస్.. సీన్ మళ్లీ మారిపోయింది..!
ABN , First Publish Date - 2022-01-11T19:36:31+05:30 IST
Hyderabad వాసులకు మరో షాకింగ్ న్యూస్.. సీన్ మళ్లీ మారిపోయింది..!
- శివారు.. కరోనా జోరు
- చాపకింద నీరులా పెరుగుతున్న కేసులు
- శేరిలింగంపల్లిలో 80, కూకట్పల్లిలో 65
- మొత్తం కేసులు రెండు రోజుల్లో కాస్త తగ్గుదల
- తాజాగా 1042 మందికి వైరస్
- గ్రేటర్ శివార్లలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రధానంగా కూకట్పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రెండు, మూడు రోజుల క్రితం వరకు ఇరవై, ముఫ్పైగా నమోదయ్యే కేసుల సంఖ్య ఇప్పుడు భారీగా పెరుగుతోంది.
హైదరాబాద్ సిటీ : వారం రోజుల నుంచి హడలెత్తిస్తున్న కొవిడ్ కేసులు రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. శుక్రవారం 1583 కేసులు నమోదు కాగా, ఆదివారం నాటికి 1165కు చేరింది. సోమవారం 1042 మందికి వైరస్ సోకింది. ఈ నెలలో పది రోజులకు 8,817 మందికి వైరస్ నిర్ధారణ అయింది. శేరిలింగంపల్లి మండలంలో ఆదివారం 18 కేసులు నమోదు కాగా, సోమవారం ఏకంగా 80 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మండలంలోని కొండాపూర్లోని జిల్లా ఆస్పత్రి, రాయదుర్గం, హఫీజ్పేట, శేరిలింగంపల్లి ఆరోగ్య కేంద్రాల్లో మొత్తం 633 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
కూకట్పల్లిలో 22 నుంచి 65కు..
కూకట్పల్లి ప్రాంతంలో ఆదివారం 22 కేసులు నమోదు కాగా, సోమవారం 65 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అలాగే, కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని నాలుగు యూపీహెచ్సీల్లో సోమవారం 353 మందికి పరీక్షలు నిర్వహించగా, 34 మందికి పాజిటివ్గా తేలింది. గత నెలలో వంద మందికి పరీక్షలు చేస్తే, దాదాపు అన్నీ నెగెటివ్గా వచ్చాయి.
వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద శానిటైజేషన్..
కొవిడ్-19 వైరస్ వ్యాప్తి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యలపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. ముఖ్యంగా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద శానిటైజేషన్కు ప్రాధాన్యమిస్తోంది. సంక్రాంతి పండగ కోసం నగరవాసులు స్వగ్రామాలకు తరలివెళ్తున్న నేపథ్యంలో బస్, రైల్వే స్టేషన్లలోనూ శానిటైజ్ చేస్తున్నట్టు ఎంటమాలజీ విభాగం అధికారులు తెలిపారు.
6,640 మందికి ‘బూస్టర్’..
గ్రేటర్ హైదరాబాద్లో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తొలుత ఫ్రంట్లైన్ వర్కర్స్కు, 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్ ఇస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో సోమవారం రాత్రి 7.30 వరకు 6,640 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. హైదరాబాద్లో 4,404, మేడ్చల్ జిల్లాలో 1,328, రంగారెడ్డి జిల్లాలో 908 మందికి టీకాలు వేశారు.
గాలి ఆడటం లేదు..
కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతూనే ఉంది. మరో వైపు ఒమ్రైకాన్ దూసుకు వస్తోంది. ఈ నేపథ్యంలో నగర వాసులు మాస్క్లు ధరించేందుకు ఇష్టపడటంలేదు. ఇందుకు పలు కారణాలు చెబుతున్నారు. దేశంలో మాస్క్ల ధారణపై డిజిటల్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ఇటీవల (నవంబర్-డిసెంబర్ 2021)లో ఓ అధ్యయనం చేసింది.
మెట్రో, నాన్ మెట్రో నగరాల్లో నిర్వహించిన అధ్యయంలోని కీలకంశాలు...
- నగరంలో 45.76 శాతం మించి మాస్క్లు ధరించడం లేదు. పాక్షికంగా ఽ17.10 శాతం మంది, అసలు మాస్క్లు లేకుండా 37.10 శాతం మంది కనిపిస్తున్నారు. పాక్షికంగా మాస్క్లు ధరిస్తున్న వారిలో 60 శాతం మంది క్లాత్ మాస్క్లు, 35 శాతం మంది సర్టికల్ మాస్క్లు ధరిస్తున్నారు. నగరంలో మగవారితో పోలిస్తే మహిళలే ఎక్కువ మంది మాస్క్లు ధరిస్తున్నారు. 54.39 శాతం మంది సంపూర్ణంగా, 29.47 శాతం అసలు మాస్క్లు ధరించడం లేదు. 16 శాతం మంది పాక్షికంగా మాస్క్లు ధరిస్తున్నారు.
- మాల్స్లో 28 శాతానికి మించి మాస్క్లు ధరించడం లేదు. మెట్రో/లోకల్ రైళ్లలో 71 శాతం మంది మాస్క్లు ధరిస్తున్నారు. సూపర్ మార్కెట్లలో 42శాతం, పార్క్లలో 66 శాతం, బస్టాండ్లలో 57 శాతం మంది, మెట్రోస్టేషన్లలో 60 శాతం మంది మాస్క్లను ధరిస్తున్నారు. మాస్క్లు ఎందుకు ధరించడం లేదని ప్రశ్నిస్తే 20 శాతం మంది రెండు డోసుల టీకా తీసుకున్నామని, కొవిడ్ వల్ల ఏం కాదని 20 శాతం మంది.. గాలి ఆడటం లేదని 30 శాతం, మరో 30 శాతం మంది ఇతర కారణాలు చెబుతున్నారు.