Shilpa Chowdary గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి.. కోటీశ్వరురాలిని అని నమ్మించడానికి..!
ABN , First Publish Date - 2021-12-02T16:26:22+05:30 IST
ఆర్థిక మోసం కేసులో అరెస్టయిన శిల్పాచౌదరి గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి...
- చీరలతో కనికట్టు
- శిల్ప ధరించే చీరల ఖరీదు రూ. లక్షల్లో
- కోటీశ్వరురాలిగా కనిపించే ప్రయత్నాలు
హైదరాబాద్ సిటీ : ఆర్థిక మోసం కేసులో అరెస్టయిన శిల్పాచౌదరి గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తానొక కోటీశ్వరురాలిని అని నమ్మించడానికి ఆమె చాలా కష్టపడేదని తెలిసింది. పార్టీలకు హాజరయ్యేటప్పుడు రూ. లక్షల ఖరీదైన చీరలు ధరించేది. విలువైన నగలు పెట్టుకునేది. ఒకసారి కట్టిన చీర మరోసారి కట్టేది కాదని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ప్రత్యేక ఫ్యాషన్ డిజైనర్ను కూడా నియమించుకుంది. కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసి గిల్ట్ నగలు కొనుగోలు చేసేదని తెలిసింది. అలాగే శిల్పకు చెందిన రెండు అకౌంట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అయితే వాటిలో అంతగా డబ్బు లేదని తెలిసింది. దీంతో అంత డబ్బు ఆమె ఎక్కడికి తరలించారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఓ యువహీరో భార్య ఇచ్చిన ఒక్క ఫిర్యాదులోనే ఆమె రూ. 2.9 కోట్ల నగదు తీసుకుని మోసం చేసినట్లు ఉంది.
కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా..
శిల్పారెడ్డి దంపతుల బెయిల్ పిటిషన్ను, పోలీసుల కస్టడీ పిటిషన్పై తీర్పును న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది. ఈ రెండు పిటిషన్లపై తొలుత సోమవారం ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును డిసెంబర్-1కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్లు బుధవారం విచారణకు వచ్చాయి. మరోసారి వాదనలు జరిగాయి. ఇటు పోలీసులు, అటు శిల్పదంపతుల తరఫు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును గురువారానికి వాయిదా వేసింది. దాంతో శిల్పాచౌదరి దంపతులకు బెయిల్ వస్తుందా..? లేక పోలీస్ కస్టడీకి ఇస్తారా..? అనేది ఉత్కంఠగా మారింది.