బాలిక ఘటనలో మరోకోణం

ABN , First Publish Date - 2020-10-19T09:57:04+05:30 IST

ఖమ్మంలో కామాందుడి చేతిలో అగ్నికి ఆహుతైన బాలిక సంఘటణలో మరో కోణం వినిపిస్తోంది.

బాలిక ఘటనలో మరోకోణం

అప్పు తీర్చలేక పనిలో పెట్టినట్లు వదంతులు

పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు


ఖమ్మం రూరల్‌, అక్టోబరు 18: ఖమ్మంలో కామాందుడి చేతిలో అగ్నికి ఆహుతైన బాలిక సంఘటణలో మరో కోణం వినిపిస్తోంది. బాలిక కుటుంబానికి డబ్బులు అప్పుగా ఇచ్చిన ఓ వ్యక్తి ఆబాలికను బాకీ కింద ఖమ్మం పార్శీబందంలోని ఒక ఇంట్లో పనికి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై బాధితురాలి తల్లిదండ్రులు ఖమ్మం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.  ఖమ్మం రూరల్‌ మండలం, పల్లెగూడెం గ్రామానికి చెందిన బాలిక ఖమ్మంలోని పార్శీబందంలోని ఒక ఇంట్లో పనిచేసేది. ఆ ఇంట్లోని కామాందుడు ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.  కాలినగాయాలతో 28 రోజులు పోరాడి రెండు రోజులక్రితం బాలిక మృతిచెందిన విషయం తెలిసిందే.  కాగా బాలిక విషయంలో మరో కోణం వినిపిస్తోంది.


పల్లెగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బాలిక కుటుంబ సభ్యులకు రూ. లక్షా 50వేలు అప్పుగా ఇచ్చాడు. బాకీ పూడ్చుకునేందుకు బాలికను ముందుగా ఖమ్మంలోని ఒక ఇంట్లో పనికి కుదిర్చాడు. కొన్ని రోజుల తర్వాత మరో ఇంట్లో  రూ. రెండు లక్షలకు పనికి పెట్టాడు. ఈ విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు తెలియకుండా సదరు వ్యక్తి జాగ్రత్త పడ్డాడని తెలుస్తోంది. కాగా    తీసుకున్న అప్పు చెల్లించినా తమకు  ఆ వ్యక్తి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విసమైన రూరల్‌ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై రూరల్‌ సీఐ సత్యానారాయణ రెడ్డిని వివరణ కోరగా బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, దానిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.

Updated Date - 2020-10-19T09:57:04+05:30 IST