కమలం గూటికి మరో ఉద్యమ నేత?

ABN , First Publish Date - 2021-12-02T08:38:19+05:30 IST

మరో ఉద్యమ నేత కమలం గూటికి చేరనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చింతలగట్టు విఠల్‌ త్వరలో బీజేపీ తీర్థం తీసుకుంటారని తెలుస్తోంది.

కమలం గూటికి మరో ఉద్యమ నేత?

  • త్వరలో బీజేపీలో చేరనున్న విఠల్‌..!
  • టీఎ్‌సపీఎస్సీ మాజీ సభ్యుడితో 
  • బీజేపీ నాయకుల చర్చలు


వికారాబాద్‌/హైదరాబాద్‌, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): మరో ఉద్యమ నేత కమలం గూటికి చేరనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చింతలగట్టు విఠల్‌ త్వరలో బీజేపీ తీర్థం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. టీఎ్‌సపీఎస్సీ సభ్యుడిగా పదవీ కాలం ముగిసిన తరువాత ఆయనకు టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ లేదా ఏదైనా కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కవచ్చనే ప్రచారం కూడా జరిగింది. రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్‌ను మార్చడాన్ని తప్పుబట్టారు. జిల్లా ప్రజాప్రతినిధులు, ఉద్యమ నేతలతో జరిగిన అంతర్గత చర్చల్లోనూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారు. వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో కాకుండా జోగులాంబ జోన్‌లో చేర్చడాన్ని కూడా వ్యతిరేకించారు. జోగులాంబ జోన్‌లో నుంచి చార్మినార్‌ జోన్‌లో చేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 


ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసే విషయమై చర్చించేందుకు సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో విఠల్‌ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా విఠల్‌ను బీజేపీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ నేతలు కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయనపై బీజేపీలో చేరాలనే ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఇతర ముఖ్య నాయకులు, సంఘ్‌ పరివార్‌ బాధ్యులు కూడా ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ఉద్యోగ సంఘం నేతగా విఠల్‌ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో త్వరలో ఢిల్లీ వేదికగా జాతీయ నాయకుల సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.  


తెలంగాణ విఠల్‌..

తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా,  జేఏసీ సెక్రటరీ జనరల్‌, కో-చైర్మన్‌గా వివిధ హోదాల్లో ప్రత్యేక రాష్ట్ర సాధ న ఉద్యమాన్ని పరుగులు పెట్టించిన విఠల్‌కు ‘తెలంగాణ విఠల్‌’గా ముద్రపడింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల్లో ఆయన ఒకరు. సమైక్య రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పారు. 1996 నుంచి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే వరకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ప్రతి ఉద్యమంలో ఆయన తనదైన పాత్ర పోషించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, ప్రొఫెసర్‌ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి పని చేశారు. 


ఉద్యమంలో చూపిన తెగువ ఆయనను ‘తెలంగాణ విఠల్‌’గా ముద్రపడేలా చేసింది. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం బిల్కల్‌లో జన్మించిన విఠల్‌ విద్యాభ్యాసం స్ధానికంగానే జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.కామ్‌, ఎల్‌ఎల్‌బీ(ఎం.ఫిల్‌) చదివారు. కొంత కాలం జర్నలిస్టుగా, ఓ ఎయిడెడ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తరువాత ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-2లో ఆడిటర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 24 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన ఆయన తెలంగాణ ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారు. 1987లో తన స్వగ్రామమైన బిల్కల్‌ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత 2014, డిసెంబరు 18 నుంచి 2020, డిసెంబరు 17వ తేదీ వరకు టీఎ్‌సపీఎస్సీ సభ్యులుగా పనిచేశారు. కాగా, విఠల్‌కు ప్రభుత్వ ఉద్యోగిగా, టీఎ్‌సపీఎస్సీ బోర్డు మాజీ సభ్యుడిగా రావాల్సిన పింఛన్లను ప్రభుత్వం నిలిపివేసినట్లు సమాచారం. 

Updated Date - 2021-12-02T08:38:19+05:30 IST