రేపు మరో అల్పపీడనం
ABN , First Publish Date - 2020-08-12T09:01:52+05:30 IST
మధ్యప్రదేశ్లో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. మరోవైపు తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
- శ్రీశైలానికి కొనసాగుతున్న వరద
విశాఖపట్నం, కర్నూలు, అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్లో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. మరోవైపు తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దక్షిణ ఛత్తీ్సగఢ్ వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆతరువాత కోస్తాలో వర్షాలు పెరుగుతాయని పేర్కొంది. మంగళవారం ఉత్తరాంధ్రలో అనేకచోట్ల భారీ వర్షాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 14, 15 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా ఇన్ఫ్లో నమోదవుతోంది. మంగళవారం సాయంత్రం జలాశయానికి 1,47,890 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. సుంకేసుల, హంద్రీ నుంచి ఎలాంటి వరద లేదు.