విశాఖ ఉక్కు పోరాటంలో మరో కీలక ఘట్టం

ABN , First Publish Date - 2021-03-11T21:35:28+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు చేస్తున్న పోరాటంలో కీలకఘట్టం ఆవిషృతమైంది. స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యానికి కార్మికుల సమ్మె నోటీసులిచ్చారు.

విశాఖ ఉక్కు పోరాటంలో మరో కీలక ఘట్టం

విశాఖ: విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు చేస్తున్న పోరాటంలో కీలకఘట్టం ఆవిషృతమైంది. స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యానికి కార్మికుల సమ్మె నోటీసులిచ్చారు. ఈనెల 20 తర్వాత సమ్మెకు వెళ్తామని కార్మికుల నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గేవరకు పోరాడతామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎన్‌ఎల్‌) ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని కేంద్రం తెగేసిచెప్పింది. అందులో నూటికి నూరు శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటన తరువాత పోరాటాలను మరింత ఉధృతం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 15న ఉక్కు పరిపాలన భవనం వద్ద భారీ ఎత్తున నిరసన, 20న జాతీయ, రాష్ట్ర స్ధాయి కార్మిక నాయకులతో ఉక్కు తృష్ణా మైదానంలో కార్మిక గర్జన నిర్వహించనున్నారు. 15, 16, 17 తేదీల్లో అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటరీ నాయకులను కలిసి మద్దతు తెలపాలని కోరనున్నారు.


విశాఖ ఉక్కు ఉద్యమానికి తెలంగాణ నుంచి కూడా మద్దతు వస్తోంది. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఏపీ ప్రజలు చేస్తున్న పోరాటానికి టీఆర్‌ఎస్‌ తరఫున మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. అవసరమైతే సీఎం కేసీఆర్‌ అనుమతితో ఉద్యమంలో కూడా పాల్గొంటామని తెలిపారు. ఈ ఉద్యమానికి తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క కూడా మద్దతు ప్రకటించారు. ‘‘ఒక చాయ్‌వాలా... చౌకీదారు నుంచి సేల్స్‌మ్యాన్‌గా మారుతున్నారు. మోదీజీ... మీరు ప్రధానమంత్రి, సేల్స్‌మ్యాన్‌ కాదు. మా హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోం. విశాఖ ప్రజలారా... ఉక్కుపై ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గొద్దు. మీకు నా మద్దతు ఇస్తున్నాను’’ అని సీతక్క ప్రకటించారు.

Updated Date - 2021-03-11T21:35:28+05:30 IST