సింగరేణికి మరో వందేళ్ల భవిత

ABN , First Publish Date - 2021-12-24T00:18:47+05:30 IST

రాష్ట్రంలోని సింగరేణి సంస్థకు మరో వందేళ్లపాటు భవిత ఉందని

సింగరేణికి మరో వందేళ్ల  భవిత

కొత్తగూడెం: రాష్ట్రంలోని సింగరేణి సంస్థకు మరో వందేళ్లపాటు భవిత ఉందని ఆ సంస్థ ఛైర్మన్‌, ఎండీ ఎన్‌.శ్రీధర్‌ అన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కేవలం కేంద్ర, రాష్ట్ర సహకారాలపై ఆధారపడితే మనుగడ సాధించలేమన్నారు. కార్మికుల క్రమశిక్షణ, శ్రమ శక్తితో సింగరేణికి మరో వందేళ్ల పాటు ఉజ్వల భవిత ఉందన్నారు. వ్యాపార విస్తరణ చర్యలతో కంపెనీ అభివృద్ధికి పటిష్ట పునాది వేయాలన్నారు. వచ్చే ఏడాది నుంచి నైనీ నుంచి 10 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి జరుగుతుందన్నారు. 2025 నాటికి 100 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో  పనిచేస్తామన్నారు. 


దేశంలో వందేళ్లలో ఎన్నో ప్రభుత్వ రంగ కంపెనీలు ఆవిర్భవించాయన్నారు. కొన్ని నష్టాలతో మూత పడ్డాయని, కానీ సింగరేణి మాత్రం 13 దశాబ్దాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోని దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థల కన్నా మిన్నగా పనితీరును కనబరుస్తుందని ఆయన కొనియాడారు. కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టిన 1200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం మంచి పనితీరుతో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. అలాగే 300 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లలో ఇప్పటికే 219 మెగావాట్ల నిర్మాణం పూర్తయి విద్యుత్‌ ఉత్పత్తి కూడా జరుగుతోందన్నారు. 


కరీంనగర్‌ జిల్లాలోని లోయర్‌ మానేరు డ్యాంలో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆయన ప్రకటించారు. త్వరలో జియో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి శ్రీకారం చుట్టబోతున్నామని ఆయన తెలిపారు. అంకితభావం కలిగిన ఉద్యోగుల వల్లే సంస్థ నిర్దేశించుకున్న ప్రతి లక్ష్యాన్ని చేరుకోగలుగుతుందని ఆయన అన్నారు. 

Updated Date - 2021-12-24T00:18:47+05:30 IST