ఇంకెన్నాళ్లీ హత్యా రాజకీయాలు?

ABN , First Publish Date - 2021-02-25T09:15:22+05:30 IST

‘‘ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని జగన్‌ రెడ్డి రావణ కాష్టం చేస్తున్నాడు. స్వేచ్ఛగా జరగాల్సిన ఎన్నికలను రక్తసిక్తం చేసి, రాక్షసానందం పొందుతున్నాడు’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లాలో వైసీపీ

ఇంకెన్నాళ్లీ హత్యా రాజకీయాలు?

సీఎం జగన్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న

టీడీపీ కార్యకర్త సోమయ్య మృతికి దిగ్ర్భాంతి


అమరావతి,ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని జగన్‌ రెడ్డి రావణ కాష్టం చేస్తున్నాడు. స్వేచ్ఛగా జరగాల్సిన ఎన్నికలను రక్తసిక్తం చేసి, రాక్షసానందం పొందుతున్నాడు’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త సోమయ్య చికిత్స పొందుతూ మరణించడం పట్ల చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సోమయ్య మరణానికి సీఎం జగనే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ‘‘రాష్ట్రంలో ఇంకెన్నాళ్లీ హత్యా రాజకీయాలు? దాడికి పాల్పడి, ప్రాణాలు తీసిన వారిపై తక్షణమే హత్య కేసు నమోదు చేయాలి. మృతుని కుటుంబానికి భరోసా కల్పించాలి’’ అని డిమాండ్‌ చేశారు. 


నేడు కుప్పం పర్యటనకు చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు గురు, శుక్రవారాల్లో తన నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్‌ నుంచి విమానంలో బయలుదేరి బెంగళూరుకు వెళ్లి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం వెళ్తారు. శుక్రవారం శాంతిపురం, రామ కుప్పం మండలాల పార్టీ నేతలతో సమావేశం అవుతారు. అదే రోజు రాత్రి కుప్పం పట్టణ నేతలతో సమావేశం జరుగుతుంది. సోమవారం ఉదయం అమరావతికి తిరిగి వస్తారు. 


జగన్‌ ఇట్టే దొరికిపోతాడు

జగన్‌రెడ్డి ఏమి చేసినా ఇట్టే దొరికిపోతాడని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ‘‘కుప్పంలో గెలిచామని కాలర్‌ ఎగరేసినవాడు.. చంద్రబాబు పర్యటన అనగానే అడ్డుకుంటామని ప్రకటించి, అడ్డంగా దొరికిపోయాడు. మీ గెలుపులో నిజాయితీ ఉంటే.. అడ్డుకునే పనేముంది’’ అని ట్విట్టర్‌ వేదికగా నిలదీశారు.  జగన్‌ ప్రభుత్వం పథకాల ఎరవేసి ప్రజల జేబులు లూఠీ చేస్తోందని టీడీపీ తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.


గన్‌ కంటే ముందే జగన్‌.. కబుర్లేమయ్యాయ్‌?: లోకేశ్‌ 

మహిళలు, యువతులపై అఘాయిత్యాలకు తెగబడితే.. గన్‌ కంటే ముందుగా జగన్‌ వస్తాడనే కబుర్లు చెప్పారని.. కానీ, నిత్యం ఎక్కడో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని.. మరి ఆ కబుర్లు ఏమయ్యాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ప్రేమ పేరుతో డిగ్రీ విద్యార్థిని కోట అనూషను విష్ణువర్ధన్‌ రెడ్డి అత్యంత అమానుషంగా హత్య చేశాడని.. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. 

Updated Date - 2021-02-25T09:15:22+05:30 IST